మెదక్ అర్బన్, జూన్ 5: వచ్చే విద్యా సంవత్సరంలో మెదక్ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ సంఘం ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మెదక్ జిల్లా పీఆర్టీయూ సంఘం భవనానికి 500 గజాల స్థలం, నిర్మాణాకి రూ.20 లక్షలు మంజూరు చేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను డబుల్ ఇంజిన్ సర్కారు కాపీ కొడుతున్నదని, తెలంగాణ ప్రభుత్వం దేశానికే మార్గదర్శంగా నిలుస్తున్నదన్నారు. రాష్ర్టానికి అన్ని రంగాల్లో 38 శాతం, మున్సిపాలిటీల్లో 40 శాతం అవార్డులు వచ్చాయన్నారు. నాడు వ్యవసాయం దండగా అన్నారు. ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. దేశం మొత్తం వ్యవసయంలో 97లక్షల ఎకరాలు సాగు అయితే, ఒక్క తెలంగాణలోనే 57 లక్షల ఎకరాలలో వరి పండుతుందన్నారు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం మన రైతులు పండిస్తున్నారని తెలిపారు.
రైతుల కోసం సాగునీరు, కరెంట్, రైతుబంధు వంటి పథకాలను అమలు చేయడంతో వ్యవసాయం పెద్ద ఎత్తున సాగుతున్నదన్నారు. అప్పటి ఆంధ్రా పాలకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంతం చీకటి అవుతుందని హేళన చేశారని, కానీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు 24 గంటల కరెంట్ అందజేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, రాష్ర్టానికి రావాల్సిన రూ.లక్షా33వేల కోట్ల నిధులు మంజూరు చేయకుండా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు.
మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం నక్కలు కొట్టి దేశంలో హర్ గర్కో జల్ అని ప్రవేశపెట్టిందని, తెలంగాణ ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల్లో, మౌలిక వసతుల కల్పనలో దేశంలో దూసుకుపోతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీని ప్రారంభిస్తుందని, రెసిడిన్షియల్, గురుకుల పాఠశాలలను ప్రారంభించి దేశంలో నంబర్ వన్గా ఉంటున్నామన్నారు. ఏడేండ్లలోనే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మెన్ మల్లికార్జున్, పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.