హుస్నాబాద్, జనవరి 10 : సమాజంలో కవులు, రచయితల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్లోని తిరుమల గార్డెన్స్లో బుధవారం సీనియర్ జర్నలిస్టు, రచయిత మంగళారపు లక్ష్మణ్ రచించిన ‘మాయని గాయాల నెత్తుటి చరిత్ర’ అనే పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్రపై పరిశోధనలు చేసి ఆ సమాచారాన్ని సమాజానికి అందించాల్సిన బాధ్యత రచయితలపై ఉందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం, భూపోరాటాలు, పీపుల్స్ వార్ ఉద్యమం, సామాజిక ఉద్యమాల గురించి ఈ తరానికి తెలియజేయాలన్నారు. కనుమరుగైన తెలంగాణ చరిత్ర పుస్తక రూపం దాల్చాలన్నారు. హుస్నాబాద్ చరిత్ర, ప్రాంత ఉద్యమాల గురించి ఒక డాక్యుమెంట్ తీసి ప్రజలు వీక్షించేలా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే రచనలు చేస్తూ ప్రజలను ఆలోచింపజేసే విధంగా కవులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్ చైర్పర్సన్ అనితారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కర్ర శ్రీహరి, సీనియర్ జర్నలిస్టు కొండా లక్ష్మణ్, ప్రముఖ కవి, రచయిత అన్నవరం దేవేందర్, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు పిట్టల తిరుపతి, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
హుస్నాబాద్, జనవరి 10 : ఏండ్ల తరబడి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో పనిచేస్తున్న తమ వేతనాలను పెంచాలని కోరుతూ హుస్నాబాద్ పట్టణానికి చెందిన మెప్మా ఆర్పీలు బుధవారం హుస్నాబాద్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్పీలు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్పీలకు ప్రస్తుతం నెలకు రూ.4 వేల వేతనం ఇస్తు న్నదని, అది సరిపోయే పరిస్థితులు లేనందున రూ.18 వేల వేతనం ఇచ్చేలా కృషి చేయాలని మంత్రికి విన్నవించామన్నారు. కార్యక్రమంలో ఆర్పీల సంఘం నాయకులు గుర్రాల పద్మ, జగదీశ్వరి, శారద, పరకాల పద్మ తదితరులు పాల్గొన్నారు.