హుస్నాబాద్, జనవరి 10: హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో అధికారులు భాగస్వాములు కావాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గంలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవో, ఎంఈవోలు, ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గతంలో మంజూరైన పనుల్లో పెండింగ్ , కొనసాగుతున్న పనుల వివరాలను వెంటనే తెలియజేయాలని ఆదేశించారు. ఈ నెల 20న ఇంజినీరింగ్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఇటీవల ప్రభుత్వం నియోజకవర్గానికి రూ.10కోట్లు కేటాయించిందని, అత్యవసర పనులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని గురుకులాలు, వసతి గృహాలు, మోడల్ స్కూళ్లను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలన్నారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో అందించే డ్రైవింగ్ లైసెన్స్లు ఇక నుంచి హుస్నాబాద్లోనే ఇప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆర్డీవో బెన్షాలోమ్, ఏసీపీ సతీశ్, తహసీల్దార్ రవీందర్రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలో ఇటీవల డిపోకు మంజూరైన రెండు కొత్త ఎక్స్ప్రెస్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తగా మంజూరైన బస్సులను హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉండే రూట్లలో నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ అధికారులు ఉద్యోగులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.