నర్సాపూర్, నవంబర్ 3: నర్సాపూర్లో శనివారం నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి ముస్లిం మైనార్టీ కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ రానున్నట్లు జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమోద్దీన్ తెలిపారు. శుక్రవారం నర్సాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయన ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ హాజరవుతున్న సమావేశానికి ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సీఎం కేసీఆర్ హయాంలో ముస్లిం మైనార్టీలు ఎంతగానో అభివృద్ధి చెందారన్నారు. ఈ ఎన్నికల్లో ముస్లింలు గడపగడపకూ వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి విజయానికి పాటుపడాలని తెలిపారు. షాదీముబారక్ పథకంతో ఎంతో మంది ముస్లింలు లబ్ధిపొందారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి ముస్లిం మైనార్టీల కోసం పట్టణంలో శ్మశాన వాటికకు ఐదెకరాల స్థలం కేటాయించారన్నారు. సీఎం కేసీఆర్ నిలబెట్టిన బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి విజయానికి తోడ్పడతామని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ యువ నాయకుడు వాకిటి శశిధర్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హబీబ్ఖాన్, ఎంపీపీ కో ఆప్షన్ మెంబర్ ఎండీ లాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు.