చేర్యాల, డిసెంబర్ 28 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయశాఖ రాష్ట్ర కమిషనర్ అనీల్కుమార్ తెలిపారు. గురువారం మల్లికార్జున స్వామి క్షేత్రంలో పర్యటించారు. మొదటగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం 50ధర్మాశాలల భవనం, రేణుకాఎల్లమ్మ ఆలయం వద్ద గుట్ట పైభాగంలో ఏర్పాటు చేస్తున్న త్రిశూలం, ఢమరుక నిర్మాణ పనులు, దాసారం గుట్ట వద్ద నిర్మిస్తున్న రోడ్డు పనులను పరిశీలించారు.
తోటబావి వద్ద శాశ్వత కల్యాణవేదిక వద్ద చేపట్టిన కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. రూ.12కోట్లతో నిర్మిస్తున్న క్యూలైన్ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బందోబస్తుపై సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై నాగరాజుతో చర్చించారు. కల్యాణోత్సవానికి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ హాజరై పట్టువస్ర్తాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఈవో బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు, ఒగ్గు పూజారులు, సిబ్బంది ఉన్నారు.