మద్దూరు (ధూళిమిట్ట), జనవరి 9 : రాష్ట్ర ప్రభుత్వం ధూళిమిట్ట ప్రజల ఆకాంక్షను గుర్తించి రెండేండ్ల క్రితం మండలంగా ఏర్పాటు చేసింది. మండలం ఏర్పాటు చేయడమే కాకుండా అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో ధూళిమిట్ట మండలం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. మండల కేంద్రంలో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి, అభివృద్ధి పనులు చేపట్టింది. ఇప్పటికే మండల కేంద్రంలో రూ.15 లక్షల వ్యయంతో కరెంట్ సెక్షన్ ఆఫీస్, రూ.25 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్రం, రూ.20లక్షలతో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, రూ.40 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.15లక్షలతో గ్రామీణ సంత, ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం కింద ప్రాథమిక పాఠశాలకు రూ.28లక్షలు, ఉన్నత పాఠశాలకు రూ.57లక్షల నిధులు ప్రభుత్వం మం జూరు చేసింది. పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కృషితో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నేడు అభివృద్ధి పనులకు భూమిపూజ
ధూళిమిట్ట గ్రామంలో ప్రభుత్వం చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి తన్నీరు హరీశ్రావు మంగళవారం భూమి పూజ చేయనున్నారు. ప్రధానంగా గ్రామంలో డీఎంఎఫ్ నిధులు రూ.10లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవనం, ఈజీఎస్ నిధులు రూ.50లక్షలతో చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణ పనులు, డీఎంఎఫ్ నిధులు రూ.20లక్షలతో చేపట్టే విలేజ్ కమ్యూనిటీ హాల్, రూ.10లక్షలతో రెడ్డి కమ్యూనిటీహాల్, రూ.10లక్షలతో గ్రామంలోని నాలా పూడ్చివేత పనులు, రూ.10లక్షలతో పద్మశాలీ కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి మంత్రి భూమి పూజ చేయనున్నారు.
మంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు
ధూళిమిట్ట మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న మంత్రి పర్యటన కోసం గ్రామ సర్పంచ్ దుబ్బుడు దీపికావేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మంద యాదగిరి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమవుతున్నారు.