సిద్దిపేట, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న వైద్య సేవలను ప్రజలకు వివరించాలి.. దవాఖానకు వచ్చేవారితో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారి వరకు అందరూ ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడాలి.. మనం ప్రేమగా మాట్లాడితే వారిలో రోగం సగం నయమవుతుంది’… అంటూ మంత్రి తన్నీరు హరీశ్రావు వైద్య బృందానికి సూచించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఈసీఐఎల్ సౌజన్యంతో రూ.70 లక్షల విలువైన లాప్రోస్కోపి వ్యాక్యూమ్ను జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈసీఐఎల్ ప్రతినిధి బృందంతో కలిసి మంత్రి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా దవాఖానలోని పలు విభాగాలను తనిఖీ చేసిన ఆయన రోగులతో మాట్లాడి వైద్యసేవల తీరును తెలుసుకున్నారు. ఇన్, ఔట్ పేషెంట్లపై మంత్రి వైద్య బృందాన్ని ఆరా తీశారు. ప్రతిరోజు 900నుంచి 1200మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తుండగా, ఇన్పేషెంట్లు 720 నుంచి 556 మంది ఉన్నట్లు అధికారులు సమాధానమిచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీలో భాగంగా ఈసీఐఎల్ కంపెనీ సహకారంతో లాప్రోస్కోపి వ్యాక్యూమ్ను అందించిన అర్చన సురేశ్, వారి ప్రతినిధి బృందానికి ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట దవాఖానకు 4, గజ్వేల్ దవాఖానకు 2 వ్యాక్యూమ్స్ అందించడం అభినందనీయమన్నారు. జిల్లాలో 99.9 శాతం ఇన్సిట్యూషన్ డెలివరీలు జరుగుతుండగా, ప్రభు త్వ దవాఖానల్లో 66 శాతం, ప్రైవేట్లో 33.9 శాతం జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ప్రసూతి ఆపరేషన్లు ప్రైవేటులోనే ఎక్కువగా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, కలెక్టర్, వైద్య బృందం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
గర్భిణులకు అందుతున్న సేవలపై ఆరా..
జిల్లాలోని గర్భిణులకు అందుతున్న సేవలపై మంత్రి హరీశ్రావు ఆరా తీశారు. గర్భిణులు వ్యా యామం చేసేలా నర్సును ఏర్పాటు చేయాలని దవాఖాన సూపరింటెండెంట్కు మంత్రి సూచించారు. అలా కుదరకపోతే గర్భిణుల వార్డులో ఒక టీవీ స్క్రీన్ ఏర్పాటు చేయాలని, వారు వీడియో చూసి వ్యాయామం చేయడానికి సులభంగా ఉం టుందన్నారు. గత నెలలో డెలివరీల సంఖ్య 380 ఉందని, ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని ఆదేశించారు. దవాఖానల్లో ఇన్ఫెక్షన్ అనే మాట రావద్దని, అవసరమయ్యే వైద్య పరికరాలను కొనుగోలు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆర్థోపెడిక్ సేవలు అందుబాటులో ఉండాలని, అవసరమైనవారికి సర్జరీలు చేయాలన్నారు.