సిద్దిపేటరూరల్, మార్చి 5 : ‘కులం, మతం పేరిట ఓట్లు దండుకునే బీజేపీ ఒక ఝుఠా పార్టీ’ అని.. బీఆర్ఎస్ది సేవా పార్టీ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని రావురూకులలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి నూతన పంచాయతీ భవనం, విలేజ్ ఫంక్షన్హాల్ ప్రారంభించి, ఇంద్రగూడెం నుంచి దుబ్బాక నియోజకవర్గం అప్పనపల్లి వరకు రూ.33 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం రావురూకులలోని విలేజీ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనమని మళ్లీ చెబుతోందన్నారు. తెలంగాణ వాసులను నూకలతో కూడిన అన్నం తినమని ప్రజలను అవహేళన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ చేసే గుణం కలిగిన పార్టీ బీఆర్ఎస్ది అయితే డీజిల్, పెట్రో, సిలిండర్ ధరలు పెంచుడు , ఉద్యోగాల తొలిగింపు, ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టడం తప్ప బీజేపీ ప్రజలకు చేస్తున్న సేవ ఏమీలేదని కేంద్రంలోని బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లకోసం మాటలు చెప్పే నాయకుడు సీఎం కేసీఆర్ కాదని, ప్రజల మనస్సులో ఏమున్నదో తెలుసుకుని పని చేసే గొప్ప నాయకుడు అని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు.
పండుగలా వ్యవసాయం
ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలకు వ్యవసాయం దండుగలా అనిపిస్తే, స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పండుగలా చేసిందని మంత్రి గుర్తు చేశారు. యాసంగిలో విద్యుత్ డిమాండ్ తీవ్రంగా ఉందని భారమైనా ప్రభుత్వం కొనుగోలు చేసి అందిస్తోం దన్నా రు. 7వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉం టే, ప్రస్తుత డిమాండ్ 14 వేల మెగావాట్లకు చేరుకుందన్నారు. తెలంగాణలో 30 లక్షల వ్యవసాయ మోటర్లు ఉన్నాయన్నారు. తెలంగాణలోని ఏఒక్కరూ దరఖాస్తు చేయకున్నా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఏడాదికి రూ.10 వేల కోట్లు కేవలం రైతు బంధు కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామాభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరిన గ్రామస్తులు
‘మీ నిర్ణయమే..మా నిర్ణయం’ గ్రామాభివృద్ధికి సహకరించాలని మంత్రి హరీశ్రావును రావురూకుల గ్రామస్తులు కోరారు. గ్రామం మీదుగా రూ.160 కోట్లతో నిర్మిస్తున్న రింగ్రోడ్డుకు సహకారం అందించాలన్నారు. గ్రామస్తులంతా పెద్దమనస్సుతో రింగురోడ్డు గ్రామం నుంచి వెళ్లేలా సహకరించాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. రోడ్డు నిర్మాణంలో ఇండ్లు కోల్పోయే వారికి రూ.3 లక్షలు గ్రాంట్ రూపేణా అందిస్తామని తెలిపారు. గ్రామానికి ఫంక్షన్హాల్ కావాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కోరిన వెంటనే నిర్మించి అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేశారు. వివిధ పనులకు మరో రూ.1.15 కోట్లు కేటాయించామని, గ్రామానికి అవసరమైన 50 తుంపరసేద్యం పరికరాలు పంపిణీ చేస్తామని, కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలంటే రైతులు ఆయిల్పామ్ తోటలు సాగు చేసుకోవాలని కోరారు.
రావురూకుల అభివృద్ధి భేష్
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ పుట్టిన ఊరికి వస్తే నాకు సంతోషంగా ఉంటుందన్నారు. ఇక్కడి బువ్వ తిని పెరిగినవాడిని కాబట్టి ఊరిపై మమకారం ఉంటుందన్నారు. నేను చదువు చెప్పిన బడికి వెళ్లే దారికి రోడ్డు మంజూరు కావడం..శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విలేజ్ ఫంక్షన్ హాల్కు హరీశన్న ఫంక్షన్ హాల్ అని పేరు మార్చాలని గ్రామస్తులు,స్థానిక ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే రసమయి కోరారు. గ్రామాభివృద్ధికి ప్రజలంతా సహకారం అందించాలని కోరారు. జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఒకే నినాదంతో మొదలైందని..నీళ్లు, నియామకాలు, నిధులు అని..వీటన్నింటిని మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో సాధించుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీహరిగౌడ్, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి, చిన్నగుండవెల్లి సర్పంచ్, రావురూకుల సర్పంచ్, పుల్లూరు సర్పంచ్ పల్లె నరేశ్గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రతి గ్రామానికి కాళేశ్వరం జలాలు
సిద్దిపేట రూరల్,మార్చి 5: ప్రతి గ్రామానికి కాళేశ్వరం జలాలు వచ్చేలా కాల్వలు, పైపు లైన్లు వేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట రూరల్ మండలంలోని బుస్సాపూర్లో హనుమాన్ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఎస్సీ కమ్యూనిటీహాల్, మహిళా సమావేశ భవనం, లైబ్రరీ హాల్,రూ.16 లక్షలతో ఏర్పాటు చేసిన 10 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజీని మంత్రి ప్రారంభించారు. అనంతరం పంచాయతీ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం జలాలు తెచ్చామన్నారు. ఎత్తున ఉన్న బుస్సాపూర్ గ్రామానికి రాష్ట్రంలోనే తొలిసారిగా పైపులైన్ల ద్వారా సాగునీరు త్వరలో రానున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ కృషితో మీ ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయన్నారు. ఈనెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండేండ్లుగా పెండింగ్లో ఉన్న వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తూ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మహిళా సంఘాల సభ్యులకు మంత్రి తీపికబురు చెప్పారు. వరదరాజ్పల్లి- ఘనపురం, తోర్నాల, గుడికందుల గ్రామాలకు వెళ్లే రోడ్డు సమస్య ఉందని చెబితే చక్కటి రోడ్డు వేశామని, త్వరలో డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.
తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
అనవసరంగా ఆపరేషన్లు చేయించొద్దని, ఆపరేషన్లతో ఆరోగ్యం క్షీణిస్తున్నదని మహిళలకు అవగాహన కల్పించాలని మంత్రి హరీశ్రావు కోరారు. మూహుర్తం పేరుతో ఆపరేషన్ కోసం పట్టుపట్టవద్దని, ఏఎన్ ఎం, ఆశవర్కర్లు చెబుతున్నట్లు సాధారణ డెలివరీ చేయించాలని, ఆపరేషన్తో తల్లీబిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. మొదటి గంటలో తల్లిపాలు చిన్నారులకు పడితే ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. శిశు మరణాలు తగ్గించాలని, ఇందుకు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పని చేయాలని కోరారు. ఈనెల నుంచి కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బుస్సాపూర్ సర్పంచ్ సదాశివారెడ్డి, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్, ఎంపీపీ శ్రీదేవీరామచందర్రావు, గ్రామనాయకులు, వార్డు సభ్యులు,మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.