పటాన్చెరు స్టేడియం జిల్లాకే ఆదర్శం
క్రీడామైదానాలు ఆరోగ్య కేంద్రాలు కావాలి
గ్రామాల్లోనూ ఆటస్థలాలు ఏర్పాటు చేస్తున్నాం
త్వరలో స్పోర్ట్స్ కిట్స్ ఇస్తాం
సర్కారు దవాఖానల్లో కాన్పులు పెరగాలి
ఆక్సిజన్ ప్లాంట్లతో రోగులకు భరోసా
నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యం
ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు
పటాన్చెరులో పర్యటన
మైత్రీ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవం
క్రీడా, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని, అందులో భాగంగానే పల్లెల్లోనూ క్రీడామైదానాలు ఏర్పాటు చేస్తున్నారని, ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం పటాన్చెరులో రూ.7.50 కోట్లతో అభివృద్ధి చేసిన మైత్రీ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పటాన్చెరులో నిర్మించిన స్టేడియం ఉమ్మడి జిల్లాకే తలమానికంగా ఉందని కొనియాడారు. యువత సెల్ఫోన్లలో మునిగి తేలకుండా క్రీడలపై దృష్టి సారించాలన్నారు. పటాన్చెరులో త్వరలోనే రూ. 300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖానను మూడు వందల పడకలతో నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వోకు సూచించారు. ప్రసూతి వార్డులో పర్యటించి తల్లీబిడ్డల క్షేమం గురించి ఆరాతీశారు.
పటాన్చెరు, జూన్ 5 : పటాన్చెరు పట్టణంలో ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేసుకున్న మైత్రి స్టేడియాన్ని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. సర్కారు దవాఖానలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. రూ. 7.50 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ స్టేడియం, ఏషియన్ పెయింట్ సంస్థ సహకారంతో రూ. 1.10 కోట్లతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను, పీఎం కేర్ ద్వారా ఏర్పాటు చేసిన మరో ఆక్సిజన్ ప్లాంట్ను, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, శాసనమండలి మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనం తరం ఏరియా దవాఖానను తనిఖీ చేశారు.
ఏం పెద్దమ్మా దవాఖానలో డాక్టర్లు మంచిగా చూస్తున్నారా.? అంటూ మంత్రి తన్నీరు హరీశ్రావు పేషంట్లను అడగడంతో వారు బాగా చూస్తున్నారని సమాధానమిచ్చారు. చివరిగా పరీక్షలు ఇక్కడే చేస్తున్నారా.? బయటకు రాస్తున్నారా.? అని ఆమెను అడిగారు. ఆ మహిళ ఒక్క టెస్ట్కు మాత్రం బయటకు పంపారని సమాధానం ఇచ్చింది. దీంతో అక్కడ ఉ న్న ఏరియా దవాఖాన వైద్య సిబ్బందిని పరీక్షలకు బయటకు ఎందుకు పంపుతున్నారని మంత్రి ప్రశ్నించారు. గైనకాలజిస్టులు చేయాల్సిన పరీక్షలు సైతం బయటకు రాయడం తగదని, ఎంత మంది డాక్టర్లు ఉన్నారని ప్రశ్నించారు. దవాఖానలో ఐదు మంది గైనకాలజిస్టులు ఉన్నారని సమాచారం రావడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. బయటకు పరీక్షలు రాయకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రసుతి వార్డులో పర్యటించి తల్లీబిడ్డల ఆరోగ్యంపై ఆరాతీశారు.
కాన్పుల లెక్కలపై అసంతృప్తి
పటాన్చెరు ఏరియా దవాఖానలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారని డీఎంహెచ్వోను మంత్రి అడిగారు. 24మంది డాక్టర్లు ఉన్నారని చెప్పారు. స్టాఫ్ నర్సులు 35మంది ఉన్నారని తెలుపడంతో మరి కాన్పులు ఎన్ని జరుగుతున్నాయని మంత్రి అడిగారు. 105 అయ్యాయని చెప్పడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు 300కు తక్కువ కాకుండా కాన్పులు జరగాలని మంత్రి పేర్కొన్నారు. ఇన్ని వసతులు కల్పించిన తర్వాత కూడా దవాఖానల్లో కాన్పులు పెరగకపోవడం తగదన్నారు. గరీబులు నివసింసే ఈ ప్రాంతంలో కాన్పులు ప్రభుత్వ దవాఖానలోనే జరిగేలా చూడాలని సూచించారు. సంగారెడ్డి దవాఖానలో 18మంది గైనకాలజిస్టులు ఉన్నారని, జహీరాబాద్లో నలుగురు, జోగిపేట్లో ముగ్గురు, నారాయణఖేడ్లో ముగ్గురు ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వోకు ఆదేశాలు ఇచ్చారు. సంగారెడ్డిలో అదనంగా ఉన్న డాక్టర్లను నారాయణఖేడ్, జోగిపేట్కు పంపాలని కోరారు. ప్రైవేటు దవాఖానల కంటే మన వద్దనే అధికంగా కాన్పులు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ ఇవ్వడం, హైరిస్క్ సెంటర్ ద్వారా సిజీరియన్లు సైతం చేయడం, నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో కాన్పులు పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు పెంచితే ప్రోత్సాహకంగా రూ. 3వేలు డాక్టర్కు, హెడ్నర్స్లకు అందజేస్తామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో 62శాతం, ప్రైవేటులో 38శాతం కాన్పులు జరుగుతున్నాయని మంత్రి అన్నారు..
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి డైనమిక్ లీడర్, ఏదైనా పని తీసుకుంటే పూర్తి చేసేవరకూ వదలడు అని మంత్రి హరీశ్రావు అభినందించారు. పటాన్చెరు పట్టణంలో అద్భుతమైన స్టేడియాన్ని రూ. 7.5ం కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేశారు. అందరి ఆరోగ్యాలకు భరోసా కల్పించేందుకు ఆక్సిజన్ ప్లాంట్ను ఏషియన్ పెయింట్స్ వారి సౌజన్యంతో పెట్టించారని ఎమ్మెల్యేను కొనియాడారు. దాతల సాయంతో ఏరియా దవాఖానలో ఎన్నో రకాల వసతులు కల్పిస్తున్నారని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. గ్రామా లు, పట్టణాల్లో క్రీడామైదానాలను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. యువతకు స్పోర్ట్స్ కిట్స్ కూడా అందజేస్తున్నామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బీపీ 25 శాతం మందిలో ఉందని ఒక సర్వేలో తేలిందన్నారు. బీపీ, షుగర్, స్థూలకాయం నేటి తరానికి శాపంగా మారుతున్నదన్నారు. వ్యాయామం, క్రీడలు, యోగా వంటివి వీటిని నియంత్రించేందుకు ఉపకరిస్తాయన్నారు. సెల్ఫోన్లో మునిగి తెలుతున్న యువతను తల్లిదండ్రులు క్రీడలవైపునకు మళ్లించాలన్నారు. సంపూర్ణమైన ఆరోగ్యం, శారీరిక శ్రమతో వస్తాయన్నారు. పటాన్చెరులో నిర్మించిన స్టేడియం ఉమ్మడి జిల్లాకే తలమానికంగా ఉందని మంత్రి కొనియాడారు. పటాన్చెరు త్వరలోనే సూపర్ స్పెషాలిటీ దవాఖానను మూడు వందల పడకలతో నిర్మిస్తామన్నారు. రూ. 300కోట్లతో ఈ దవాఖాన పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. అందరి ఆరోగ్యాలకు తెలంగాణ సర్కారు ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు.
సీఎం స్ఫూర్తితోనే అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడే ప్రతి పనిని చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఎంతో చరిత్ర ఉన్న మైత్రీ మైదానాన్ని అభివృద్ధి చేసేందుకు దశాబ్దాలు పట్టిందన్నారు. ఇప్పుడు అన్ని రకాల సౌకర్యాలతో స్టేడియం అందుబాటులోకి వచ్చిందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎప్పుడు వెనక్కి పోలేదన్నారు. 5వందల మందికి పోలీస్ శిక్షణను సైతం అందజేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాజర్షిషా, మాజీ ఎమ్మెల్యే కె. సత్యనారాయణ, ఎంపీపీలు సుష్మశ్రీ, దేవానంద్, ప్రవీణావినయ్భాస్కర్రెడ్డి, జడ్పీటీసీలు సుప్రజావెంకట్రెడ్డి, రోజాబాల్రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, పుష్పానగేశ్, సింధూఆదర్శ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహాగౌడ్, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, సర్పంచ్లు ఉపేందర్ ముదిరాజ్, సుధీర్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, రవి, గూడెం మధుసూదన్రెడ్డి, అఫ్జల్, పరమేశ్ యాదవ్, గూడెం యాదమ్మ, నర్సింహారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, దశరథరెడ్డి, బి.వెంకట్రెడ్డి, రవీందర్, నర్రాభిక్షపతి, షకీల్, శ్రీధర్చారి, డీఎస్పీ భీంరెడ్డి, తహసీల్దార్ మహిపాల్రెడ్డి, సీఐ వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.