స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి, ఎల్లుపల్లి గ్రామాల శివారులో నూతనంగా నిర్మించిన వృద్ధాశ్రమం, మహిళా ప్రాంగణం, జిల్లా మహిళా సమాఖ్య భవనాలు, సిద్దిపేటలోని మోడ్రన్ బస్టాండ్లో సెల్ప్బీపీ చెకప్ మిషన్, సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడులో కొత్తగా యూనియన్ బ్యాంకును సోమవారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేటలో మహిళల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. వారికోసం భరోసా, సఖీ సెంటర్లు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, శిశుగృహం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనాథ చిన్నారుల కోసం బాలరక్షా భవనం, అనాథ శిశువుల కోసం శిశుగృహాలను ఏర్పాటు చేశామన్నారు.
– సిద్దిపేట అర్బన్/ సిద్దిపేట/సిద్దిపేట రూరల్, అక్టోబర్ 9
సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 9: రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచేలా సిద్దిపేట జిల్లా సమాఖ్య భవనాన్ని నిర్మించామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం ఉదయం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని మిట్టపల్లి, ఎల్లుపల్లి గ్రామాల శివారులో నూతనంగా నిర్మించిన వృద్ధాశ్రమం, మహిళా ప్రాంగణ ం, జిల్లా మహిళా సమాఖ్య భవనాలను జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రికార్డు సమయంలో మహిళా సమాఖ్య భవనం పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. ఇందుకు సహకరించిన కలెక్టర్, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళల శిక్షణ కోసం మహిళా ప్రాంగణం, వృద్ధులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో వృద్ధాశ్రమం, మహిళా సమాఖ్య భవనం మూడు ఒకే చోట నిర్మించినట్లు చెప్పారు. రూ. కోటి ప్రహరీ, సీసీ కెమెరాలు, ఇతర సామగ్రి ఏర్పాటు చేసేందుకు కేటాయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పింఛన్ పెంచి ఇస్తున్నప్పటి నుంచి కుటుంబాల్లో తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారన్నారు. పిల్లలు పట్టించుకోకుండా ఉన్న తల్లిదండ్రులు, ఒంటరి వృద్ధులకు వృద్ధాశ్రమంలో అన్ని సౌకర్యాలు కల్పించి కన్న తల్లిదండ్రుల మాదిరిగా చూసుకుంటామన్నారు. అలాంటి వారు ఉంటే ఇక్కడికి పంపించాలని కోరారు. వృద్ధాశ్రమంలో భోజనంతోపాటు ఒక స్టాఫ్ నర్సు, ఒక ఫిజియోథెరపిస్ట్ను ఏర్పాటు చేయిస్తామన్నారు.
మహిళల కోసం అనేక కార్యక్రమాలు
సిద్దిపేటలో మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఇందులో భరోసా, సఖీ కేంద్రాలు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, శిశుగృహ వంటివి ఉన్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. కష్టాల్లో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి ఇవి ఉపయోగపడుతాయన్నారు. గృహహింసతో బాధపడుతున్న వారికి భరోసా, సఖీ కేంద్రాలు సేవలు అందిస్తాయన్నారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకునే వారిని భరోసా కేంద్రాలకు పంపించాలని.. అక్కడ ఏఎన్ఎం, స్టాఫ్ నర్సు, డాక్టర్తోపాటు ఒక పోలీస్ సిబ్బంది ఉంటారన్నారు. అవసరం ఉన్న వారికి న్యాయసలహాలు కూడా ఇస్తారన్నారు. ఆపదలో ఉన్న మహిళల కోసం ఈ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యోగాలు చేసే ఒంటరి మహిళల కోసం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. భరోసా, సఖీ, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నాయన్నారు. అనాథ చిన్నారుల కోసం బాలరక్షా భవనం, అనాథ శిశువుల కోసం శిశుగృహలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇటీవల శిశుగృహలో ఓ శిశువుకు శ్రీజ అని తానే నామకరణం చేసినట్లు తెలిపారు.
కష్టంలో ఉన్నవారికి సేవ చేస్తే నిజమైన సంతృప్తి వస్తుందన్నారు. భవిష్యత్లో మహిళా సమైక్య భవనాన్ని బలోపేతం చేసేందుకు సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేటలో మహిళల కోసం మాతాశిశు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా డెలివరీలు చేయించి ఇంటి దగ్గర పంపించే కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గతంలో ప్రభుత్వ దవాఖానలో 30 శాతం డెలివరీలు అయితే.. నేడు 76 శాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లో జరుగుతున్నట్లు తెలిపారు. వీటితో పాటు హుస్నాబాద్లో ఆర్డీఓ కార్యాలయం, గజ్వేల్లో ఆర్డీఓ కార్యాలయం, దుబ్బాకలో అద్భుతమైన దవాఖాన వచ్చిందన్నారు. సిద్దిపేట పేరును, గౌరవాన్ని కాపాడుకుందామని.. మీ ప్రేమ ఆశీర్వాదం కూడా ఉండాలన్నారు. సద్దితిన్నరేవు తలవాలని.. మాట మీద నిలబడ్డ ప్రభుత్వానికి మీ దీవెనలు, ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు.సిద్దిపేటను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్దామన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మహిళా సంఘాల సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.