మెదక్, ఏప్రిల్ 13: ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మకమైన చర్యలతో వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పకడ్బందీగా నిర్వహించుటకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014లో రూ.3392 కోట్ల ధాన్యం సేకరిస్తే నేడు రూ.26,600 కోట్లకు చేరిందన్నారు. యాసంగిలో ఇంత పెద్ద మొత్తంలో వరి సాగు ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. ఈ యాసంగిలో రాష్ట్రంలో 80 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొని 7000 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఒక్క మెదక్ జిల్లాలోనే 2లక్షల 60వేల ఎకరాల్లో పంట సాగయ్యిందన్నారు. ఎకారా 24 క్వింటాళ్ల పంట చొప్పున 6 లక్షల 19 వేల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. ఇందులో సొంత వినియోగం, ప్రైవేట్ అమ్మకం పోను కొనుగోలు కేంద్రాల వద్దకు నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని, ఈ పంటను కొనుగోలు చేయడం మన లక్ష్యమని. దీన్ని సకాలంలో సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కంకణబద్ధులై పని చేయాలని కోరారు. ప్రభుత్వం మద్దతు ధరకు రైతుల నుంచి ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కేంద్రాలకు ధాన్యం తెచ్చేలా వ్యవసాయాధికారులు అవగాహన కలిగించాలన్నారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఎత్తైన ప్రాంతాల్లో ధాన్యం కుప్పలు పోయాలని, కల్లంలో అరబెట్టుకుని తీసుకురావాలన్నారు. ప్రతి కేంద్రంలో ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ మిషన్లు, మాయిశ్చర్ మీటర్లు, టార్పలిన్స్ అవసరమైన గన్నీ బ్యాగులు ముందస్తుంగా సమకూర్చుకోవాలన్నారు. గోనె సంచుల కొరత లేకుండా అవసరానికి తగ్గట్టుగా పీపీసీ కేంద్రాలకు సరఫరా చేయాలన్నారు. రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్లు, పీఏసీఎస్, ఐకేపీ, గన్నీ బ్యాగ్ సరఫరాదారులతో, పోలీసులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని, మైక్రో లేవల్ ప్లానింగ్ సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు.
కొనుగోలు కేంద్రాలో వసతులు కల్పించాలి
వేసవి నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించాలన్నారు. షామియానా, తాగు నీటి వసతి కల్పించాలన్నారు. రైతులు నష్టపోకుండా ఉండాలంటే తాళ్లు లేకుండా ఆరబెట్టిన ధాన్యం కేంద్రాలకు తెచ్చేలా అవగాహన కలిగించాలన్నారు. పర్యవేక్షణకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని కలెక్టర్కు సూచించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వీలైనంత త్వరగా రైస్ మిల్లులకు తరలించి, అకనాలెడ్మెంట్ ఇస్తూ ట్యాబ్ ఎంట్రీ చేసి రైతులకు త్వరగా డబ్బులు చెల్లించేలా చూడాలన్నారు. రైస్ మిల్లులో ధాన్యం వెంటనే దించుకునేలా పని చేసే హమాలీలను అధిక సంఖ్యలో పెట్టుకునేలా చూడాలన్నారు. తరుగు పేరుతో ఏ మాత్రం కోత విధించడానికి వీలులేదని స్పష్టం చేశారు. సీఎంఆర్ పెట్టని మిల్లులకు ధాన్యం ఇవ్వొద్దని, బాగా పనిచేస్తున్న మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించాలని, అవసరమైతే ఇంటర్మీడియెట్ గోడౌన్స్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఎక్కడా తరుగు వస్తున్నదనే మాట రాకుండా కొనుగోలు జరగాలన్నారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందని అన్నారు. ఏమైనా సమస్యలుంటే కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేసేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ధాన్యం లోడింగ్ వేగంగా అయ్యేలా చూడాలని, ఎలాంటి కోతలు విధించరాదని అన్నారు. రోజూ అధికారులు రెండు లేదా మూడు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. వ్యవసాయ శాఖ అందించిన క్రాప్ బుకింగ్ ఆధారంగా కొనుగోలు చేయడంతో సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే ధాన్యాన్ని అరికట్టవచ్చని, ఇం దుకు పోలీసు సివిల్ సప్లయి, రెవెన్యూ విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన నిఘా పెట్టాలన్నారు.
రైతులు సంయమనం పాటించాలి
పండిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగులు చేస్తుందని, రైతులు తొందరపడొద్దని మంత్రి అన్నారు. రైతులకు అవగాహన కలిగిస్తూ చిన్న చిన్న సమస్యలను తక్షణం పరిష్కరించుకుంటూ నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. టెలీ కాన్పరెన్స్లో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, చంటి క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలతా శేఖర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జగపతి, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, రైస్ మిల్లుల సంఘం అధ్యక్షుడు చంద్రపాల్, మున్సిపల్ చైర్మన్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.