165 మంది లబ్ధిదారులకు రూ1.60కోట్ల చెక్కులు అందజేసిన మంత్రి
సిద్దిపేట, జూన్ 26 : ఆడబిడ్డల పెండ్లిలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట అర్బన్ మండలంలోని 165 మంది లబ్ధిదారులకు రూ.కోటి 60లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పేదింటి ఆడబిడ్డ పెండ్లికి రూ.1లక్షా 16 వేలు అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రైవేట్ కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. పుట్టిన పాప నుంచి ఇంటికి వెళ్లే వరకు రూపాయి ఖర్చు లేకుండా ‘అమ్మఒడి’ వాహనంలో ఇంటి వద్దకు చేర్చుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ కిట్ అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.