కంగ్టి, సెప్టెంబర్ 19: ముప్పై ఏండ్లుగా తడ్కల్ మండలం ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారని, ఇప్పుడు ఆ కల నిజమైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు అన్నారు. మంగళవారం తడ్కల్ మండలంలోని ఎంపల్లి హనుమాన్ ఆలయం వద్ద ఫంక్షన్హాల్, తడ్కల్లో మైనార్టీ భవన్, కంగ్టిలో కంగ్టి నుంచి బీదర్ జిల్లా సరిహద్దు రూ.18.75 కోట్లతో ఏర్పాటు చేయనున్న డబుల్లేన్ బీటీరోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్లు కొత్త పథకాలతో తమ గ్రామాలు, ఇండ్లకు వస్తారని, వాళ్లని నమ్మవద్దన్నారు. కర్ణాటకలో ఇదే తరహా పథకాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు వాటిని అమలుచేయకపోవడంతో అక్కడి ప్రజలు లబోదిబోమంటున్నారన్నారు. ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి కరెంట్ బిల్లులు డబుల్ చేయడంతోపాటు సరిగ్గా ఆరు గంటల విద్యుత్ కూడా సరఫరా చేయడం లేదన్నారు. మహిళలకు బస్సుల్లో ప్రయాణం ఉచితమని చెప్పి బస్సులు బంద్ చేయడంతో, ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇక్కడ హామీ ఇస్తున్న పథకాలు అక్కడ ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లేనన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో దశాబ్దాల పాటు ఎమ్మెల్యేలుగా ఉన్న కిష్టారెడ్డి, శెట్కార్ కుటుంబంతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కేసులు, కుతాంత్రాలు తప్పా, వారు అభివృద్ధి చేయలేదని విమర్శించారు. గడిచిన 9 ఎండ్ల కాలంలో బీఆర్ఎస్ అనేక అభివృద్ధి పనులు చేసిందని, గతంలో కంగ్టి మండలానికి రావాలంటే గుంతలమయమైన రోడ్లు ఉండేవని, దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.
నారాయణఖేడ్ నుంచి కంగ్టి, కంగ్టి నుంచి పిట్లం, కంగ్టి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు డబుల్ రోడ్డు వేసుకున్నామన్నారు. కంగ్టిలో గిరిజన గురుకుల పాఠశాల, మార్కెట్ గిడ్డంగి, రూ.కోటితో సీసీరోడ్డు, బట్టర్ఫ్లై లైట్లు, బస్టాండ్, రైతువేదికలు, ఇలా అనేక అభివృద్ధి పనులు చేసుకున్నట్లు తెలిపారు. ఏడాదిన్నర లోపు బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్తో ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తామన్నారు. అప్పుడు వర్షం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదన్నారు. పక్కాగా రెండు పంటలు పండించుకోవచ్చని హమీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలతో ఇక్కడి భూముల ధరలు కూడా పెరిగాయన్నారు. పక్కనే ఉన్న కర్నాటకలో భూముల రేట్లు ఏవిధంగా ఉన్నాయో బేరీజు వేసుకుంటే అభివృద్ధి తెలుస్తుందన్నారు. 60 ఏండ్లు పాలించిన ప్రతిపక్షాలు తడ్కల్ మండలాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో 4 మండలాలతో పాటు 100 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు. తడ్కల్లో మరో పక్షం రోజుల్లో రెవెన్యూ కార్యాలయంతోపాటు మండల స్థాయి కార్యాలయాలు ప్రారంభమవుతాయన్నారు. కలెక్టర్తోపాటు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి వచ్చి కార్యాలయాలు ప్రారంభిస్తారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ప్రతి నిత్యం పాటుపడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే భూపాల్రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. అంతకుముందు మంత్రికి ఎంపల్లి నుంచి తడ్కల్ వరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైక్ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎంపీపీ సంగీతావెంకట్రెడ్డి, జడ్పీటీసీలు కోట లలితా ఆంజనేయులు, నరసింహారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు గంగారం, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
మంత్రి హరీశ్రావు, ఎమ్మె ల్యే భూపాల్రెడ్డి సమక్షంలో తడ్కల్ మండల కేంద్రానికి చెందిన సుమారు 200 మంది కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కమ్మరి నరేందర్, జైపాల్, సురేశ్గౌడ్, సాయిలు, యాదు, ఇలియాస్, నాగయ్య, గంగారం, మశ్ణాజీ, ఎర్రోళ్ల సాయిలుతోపాటు 200ల మంది ఉన్నారు.