సిద్దిపేట కమాన్, ఫిబ్రవరి 15 : అన్ని కులాలను గౌరవించి సిద్దిపేటలో వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా కుల సంఘ భవనాలు నిర్మించినట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం పట్టణంలోని 2వ వార్డులో కెమిస్ట్.. డ్రగ్గిస్ట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కెమిస్ట్.. డ్రగ్గిస్ట్లు పాల్గొన్నారన్నారు. 15 సంవత్సరాల క్రితం సిద్దిపేటలో ఎల్ఐసీ ఏజెంట్లకు, 10 సంవత్సరాల క్రితం ఆర్ఎంపీ సంఘాల భవనాలు కట్టించామన్నారు. మెదక్, సంగారెడ్డిల్లో స్థలం చూసుకుంటే భవనం కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు. జనరేటర్లతో పనిలేకుండా నిరంతర విద్యుత్ అందించి తెలంగాణ రాష్ర్టాన్ని ఆకలి కేకలు, కరువు కాటకాలు లేని రాష్ట్రంగా, దక్షిణ భారతదేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేశామన్నారు.
హోటల్, ఫౌల్ట్రీ, వ్యవసాయం, ఇటుక బట్టీలు, నిర్మాణ, ఇతర రంగాల్లో పనిచేయడానికి దేశంలోని వేరే రాష్ర్టాల నుంచి తెలంగాణకు పనిచేయడానికి వస్తున్నారన్నారు. అన్ని రంగాల్లో సిద్దిపేటను మోడల్గా నిలిపామని, రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పెంచడం జరిగిందన్నారు. సిద్దిపేటలో ఐటీ టవర్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానను సిద్దిపేటలో నిర్మించుకున్నామన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, నర్సింగ్ కౌన్సిల్ మెంబర్ పాల సాయిరాం, కౌన్సిలర్ చంద్రం, నాయకులు వేణుగోపాల్రెడ్డి, సాకి ఆనంద్తో పాటు కెమిస్ట్.. డ్రగ్గిస్ట్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.