‘గౌరవెల్లి నిర్వాసితులకు దండం పెట్టి కోరుతున్నా.. రిజర్వాయర్ మిగులు పనుల నిర్వహణకు సహకరించండి.. ఎవరో చెప్పిన మాటలకు మీరు నష్టపోయి, మిగతా రైతులను నష్టపర్చకండి’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కోరారు. సోమవారం హుస్నాబాద్లో డయాలసిస్ సెంటర్, దవాఖాన భవనాన్ని ప్రారంభించారు. 50 పడకలతో నిర్మించబోయే మాతాశిశు ఆరోగ్య కేంద్రం, రూ.కోటితో నిర్మించబోయే ఫైర్స్టేషన్ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రిజర్వాయర్ పూర్తయితే నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగు నీరందుతుందని, 50వేల మంది రైతులు ప్రయోజనం పొందుతారన్నారు. కరువు పీడిత ప్రాంతం సస్యశ్యామలంగా తయారవుతుందని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
హుస్నాబాద్, డిసెంబర్ 5: ‘గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులకు దండం పెట్టి కోరుతున్నా.. రిజర్వాయర్ మిగులు పనుల నిర్వహణకు సహకరించండి.. ఎవరో చెప్పిన మాటలు విని మీరు నష్టపోయి, మిగతా రైతులను నష్టపర్చకండి.. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం మూర్ఖపు ఆలోచనలు చేస్తూ మిమల్ని రెచ్చగొడుతున్నారు.. వారి మాటలు విని రిజర్వాయర్ పరిధిలోని 50వేల మంది రైతులకు అన్యాయం చేయకండి.. రిజర్వాయర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి.. కట్క వేస్తే నీళ్లు రిజర్వాయర్లో చేరేలా అంతా సిద్ధంగా ఉంది.. మిగిలివారికి పరిహారం ఇచ్చేందుకు రూ.23కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయి.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎకరాకు రూ.15లక్షలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం.. అయినా మొండిపట్టుదలకు పోవడంసరికాదు.. రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయడానికి మీడియా, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులందరూ దయచేసి సహకరించండి’… అంటూ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అటు నిర్వాసితులను, ఇటు రాజకీయ పార్టీల నాయకులను కోరారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన డయాలసి సెంటర్, మరమ్మతులు చేసిన దవాఖాన భవనాన్ని ప్రారంభించడంతో పాటు 50పడకలతో నిర్మించబోయే మాతాశిశు ఆరోగ్య కేంద్రం, రూ.కోటితో నిర్మించబోయే ఫైర్స్టేషన్ భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ కృషితో గౌరవెల్లి రిజర్వాయర్ పనులు 98శాతం పూర్తయ్యాయని, కేవలం 2శాతం పనులు కొందరు నిర్వాసితులు, కొన్ని రాజకీయ పార్టీలతో ఆగిపోతున్నాయన్నారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే హుస్నాబాద్ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగు నీరందుతుందని, 50వేల మంది రైతులు ప్రయోజనం పొందుతారన్నారు. కరువు పీడిత ప్రాంతం సస్యశ్యామలంగా తయారవుతుందని పేర్కొన్నారు. గతంలో ఎకరాకు కేవలం రూ.5 నుంచి 12లక్షల వరకు మాత్రమే పరిహారం ఇచ్చామని, ఇక్కడి నిర్వాసితులకు ఎకరాకు రూ.15లక్షలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. మిగిలివారికి ఆర్అండ్ఆర్, భూసేకరణ కోసం రూ.23కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాజకీయ పార్టీలు ఎవరి ప్రయోజనం కోసం ప్రాజెక్టును అడ్డుకుంటున్నాయనేది నిర్వాసితులు, ప్రజలు ఆలోచించాలన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.రాష్ట్రంలో సర్కారు వైద్యంపై ప్రజలకు భరోసా పెరిగిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 12.66లక్షల కాన్పులు సర్కారు దవాఖానలో జరిగాయంటే దవాఖానల పనితీరు ఎలా ఉందో తెలుస్తుందన్నారు. 66శాతం కాన్పులు సర్కారు దవాఖానల్లోనే జరుగుతున్నట్లు చెప్పారు. గతంలో కేవలం 3 డయాలసిస్ సెంటర్లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం రాష్ట్రంలో 102డయాలసిస్ సెంటర్లు నడుస్తున్నాయని తెలిపారు.
డయాలసిస్ సెంటర్లో మిషన్ను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్రావు
మంత్రి హరీశ్రావు సహకారంతోనే హుస్నాబాద్ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఆయన కృషితోనే దవాఖాన 100పడకలుగా మారబోతున్నదని, ఎక్కడికి వెళ్లకుండా హుస్నాబాద్లోనే అన్ని రకాల చికిత్సలు అందేలా దవాఖాన సిద్ధమైందన్నారు. అన్ని వసతులతో కూడి మాతాశిశు ఆరోగ్యకేంద్రం రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. త్వరలోనే ఐవోసీ భవనం, మున్సిపల్ భవనాలు పూర్తవుతాయని చెప్పారు. హుస్నాబాద్ పట్టణంలో 160డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మంత్రి సహకారంతో మరిన్ని నిధులు తెచ్చుకొని హుస్నాబాద్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని అన్నారు. మంత్రిగా హరీశ్రావు అయ్యాక రాష్ట్రంలోని సర్కారు దవాఖానల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నదని తెలిపారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా కార్పోరేట్ స్థాయి వైద్యసేవలు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, జడ్పీ వైస్చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ కాశీనాథ్, టీవీవీపీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సాయికిరణ్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీపీలు మానస, మాలోతు లక్ష్మి, కొక్కుల కీర్తి, జడ్పీటీసీలు భూక్య మంగ, శ్యామల, ఎన్ఎల్సీఎఫ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
హుస్నాబాద్ అభివృద్ధికి ప్రాధాన్యం..
హుస్నాబాద్ పట్టణంతోపాటు హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.40కోట్లు మంజూరు చేశామన్నారు. రూ.1.73 కోట్లతో దవాఖాన పాత భవనం ఆధునీకరణ, డయాలసిస్ సెంటర్, జనరేటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. మరో 50పడకల మాతాశిశు కేంద్రానికి రూ.12.50కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. సబ్సెంటర్ల ఆధునీకరణకు రూ.1.40కోట్లు, బస్తీ దవాఖానకు రూ.23లక్షలు, రామవరం, అక్కన్నపేట పీహెచ్సీలకు రూ.20లక్షలు, కోహెడ పీహెచ్సీకి రూ.30లక్షలు మంజూరు చేశామని వివరించారు. ఎల్లమ్మ చెరువును పర్యాటకకేంద్రంగా మార్చేందుకు రూ.2కోట్లు కేటాయించామని, నెలలోపు పనులు ప్రారంభం అవుతాయన్నారు. ఎల్లమ్మ గుడికి రూ.50లక్షలు వచ్చినట్లు చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు కోరిన పనులకు అంచనాలు వేసి పంపినట్లయితే వెంటనే నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
డాక్టర్ అంబేద్కర్ అందరివాడు
కోహెడ, డిసెంబర్ 5 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడని, అన్ని వర్గాలకు చెందిన వాడని మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం కోహెడ మండలం బస్వాపూర్లో ఎమ్మెల్యే సతీశ్కుమార్తో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వీధిలైట్ల కింద చదువుకొని భారత రాజ్యాంగం లిఖించిన మహామేధావి అని కొనియాడారు. విద్య ఉంటేనే వ్యక్తికి విలువ అని చాటిచెప్పిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఆయనను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు. చదువుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తుందన్నారు. ప్రస్తుతం 3500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గుర్తుచేశారు. వీటి ఫలితం 10ఏండ్ల తర్వాత వస్తుందన్నారు. విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు అయినప్పుడు వాటి విలువ తెలుస్తుందన్నారు. లైబ్రరీ ఏర్పాటు చేయాలని సర్పంచ్ సత్తయ్య అడుగా, రూ.15లక్షలను మంత్రి మంజూరు చేశారు. అలాగే, గ్రామంలో మురుగుకాలువలు, రోడ్ల కోసం రూ.20లక్షలు మంజూరుతో పాటు గ్రామ యువకుల కోరిక మేరకు ఓపెన్ జిమ్ తక్షణమే ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు.