కోహీర్, డిసెంబర్ 27: ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలను చేయించాలని వైద్యసిబ్బందిని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిరమల్ ఫార్మా పరిశ్రమ ఆధ్వర్యంలో రూ.25లక్షలతో ఔట్ పేషెంట్ల కోసం నిర్మించిన భవనాన్ని మంగళవారం మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రసవాల కోసం గర్భిణులను ప్రైవేటు దవాఖానలకు పంపించొద్దని సూచించారు.
జిల్లాలో 86శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతున్నాయని వెల్లడించారు. ఎక్కువ డబ్బున్న వాళ్లు మాత్ర మే ప్రైవేటుకు వెళ్తున్నారని వివరించారు. గతంలో కేవలం 30శాతం మాత్రమే ప్రభుత్వ దవాఖానల్లో జరిగేవన్నారు. డాక్ట ర్లు, వైద్యసిబ్బంది కృషితోనే రా ష్ట్రంలో సంగారెడ్డి జిల్లా నంబర్వ న్ స్థానానికి చేరిందని సిబ్బందిని అభినందించారు. ప్రసవించిన వెంటనే కేసీఆర్ కిట్ అందిస్తున్నామని, గర్భిణుల ఆరోగ్యం కోసం న్యూట్రీషన్ కిట్ అందిస్తున్నామని చెప్పారు. ఇంతమంచి అవకాశాలు కల్పిస్తున్నందుకు వందశాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే చేయాలని కోరారు.
కోహీర్లో రూ.10.50 కోట్ల తో నిర్మిస్తున్న 50పడకల దవాఖానను ఒక నెలలో ప్రారంభిస్తామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద చికిత్సలు అందించేందుకు ప్రతిఒక్కరి పూర్తి వివరాలను డాటా ఎంట్రీ చేయాలని సూ చించారు. ఆన్లైన్లో నమోదు చేయిస్తే ఒక్కో వ్యక్తికి పది లక్షల రూపాయల వరకు ఉచితంగా చికిత్స అందుతుందన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు సహకరించాలని కోరారు. పిరమల్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో రూ. 25లక్షలతో భవనాన్ని నిర్మించినందుకు యజమాన్యాన్ని మంత్రి అభినందించారు.
కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా, హ్యాండ్లూం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతాప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి, డాక్టర్ రాజ్కుమార్, జడ్పీటీసీ రాందాస్, సర్పంచ్ జ్యోతిరామలింగారెడ్డి, ఎంపీటీసీ బక్కారెడ్డి, పరిశ్రమ ప్రతినిధు లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.