మెదక్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): వచ్చే జనవరి 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్శర్మ, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి కలెక్టర్లతో రెండు పడక గదుల గృహ నిర్మాణం పురోగతి, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 18 వేల 328 కోట్లతో 2 లక్షల 91లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి, పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా వందశాతం సబ్సిడీతో అందించేలా సీఎం కేసీఆర్ ప్రాజెక్టును రూపొందించారన్నారు. జీహెచ్ఎంసీ పరిధి మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా 62వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తయ్యాయని, 40 వేల ఇండ్లు నిర్మాణం తుదిదశలో ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి 26వేల ఇండ్లను అందజేశామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా కలెక్టర్లు తమ పరిధిలో నిర్మాణం పూర్తయిన, తుదిదశలో ఉన్న ఇండ్లకు వెంటనే లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించిన గ్రామం, పట్టణ పరిధిలో అధిక సంఖ్యలో అర్హులైన లబ్ధిదారులు ఉన్నచోట లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలని, మిగిలిన అర్హులు వివరాలతో వెయిటింగ్ లిస్టు జాబితా తయారు చేయాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, పూర్తయిన ఇండ్ల పంపిణీ క్షేత్రస్థాయిలో సమాంతరంగా జరగాలని మంత్రి అధికారులకు సూచించారు. రెండు పడక గదుల ఇండ్ల పంపిణీ పూర్తయిన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేయాలని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 283 కాలనీలో 18వేల డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, సంబంధించిన ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పంపిణీ చేయాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు తాగునీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్ వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.205 కోట్లు మంజూరు చేశామని, నిధులు వినియోగించుకుంటూ మౌలిక వసతుల కల్పన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు.
రూ.18వేల కోట్ల ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు రూ.11,990 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించామని, నిధులకు ఎలాంటి కొరత లేదని, రాష్ట్ర వ్యాప్తంగా తుదిదశ నిర్మాణంలో ఉన్న 40వేల రెండు పడక గదుల ఇండ్లు వేగవంతంగా పూర్తి జరిగేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వేగం పెంచాలని, ప్రతి మాసం పురోగతి పై రివ్యూ నిర్వహిస్తామని, జనవరి 15 నాటికి సంపూర్ణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
అనంతరం చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, తుదిదశలో ఉన్న ఇండ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై జిల్లాకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలన్నారు. జిల్లాలో పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని తేదీ నిర్ణయించుకొని పంపిణి చేయాలన్నారు. అనంతరం పోడు భూములు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ పల్లె ప్రకృతి వనం, తదితర అంశాలపై జిల్లాల వారీగా సమీక్షించారు.
మేడ్చల్ జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మెదక్ కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లాకు 5,254 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా, ఇంతవరకు 3,665 ఇళ్లకు పరిపాలనా ఆమోదం ఇచ్చి 2,344 ఇండ్లు పూర్తయ్యాయని, మరో వెయ్యి ఇండ్ల ప్రగతి చివరి దశలో ఉన్నాయని నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి, అర్హులైన అందజేస్తామని తెలిపారు. 63 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పోడు భూముల పరిశీలన క్షేత్రస్థాయిలో పూర్తి చేసి 39 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు కూడా నిర్వహించామన్నారు. మిగతా 24 గ్రామ పంచాయతీల్లో రెండు రోజుల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి, సబ్ డివిజనల్స్థాయిలో పరిశీలనకు పంపుతామన్నారు.
జిల్లాలో 220 గ్రామ పంచాయతీల్లో తెలంగాణా క్రీడా ప్రాంగణాలు, 21 మండలాల్లో 64 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని, మిగతా ప్రాంతాల్లో ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, అడిషనల్ ఎస్పీ బాలస్వామి, డీఆర్డీవో శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణరెడ్డి, ఆర్డీవో సాయిరాం, గిరిజన అభివృద్ధి అధికారి కేశూరం తదితరులు పాల్గొన్నారు.