సిద్దిపేట, జనవరి 24: మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి కుటుంబాలు మత్స్య సంపద ద్వారా గరిష్టంగా లబ్ధిపొందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మత్స్యకారుల సంఘాల సభ్యత్వ నమోదుపై సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్రావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరం భూక్యా, జిల్లా అదనపు కలెక్టర్లు ముజామ్మిల్ఖాన్, శ్రీనివాస్రెడ్డి, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల మత్స్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం సిద్ధించిన తరువాత సాగునీటి ప్రాజెక్టులు, చెక్డ్యాంలు, రిజర్వాయర్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో జలవనరుల సంపద పెరిగిందన్నారు.
మత్స్యకార సంఘాల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, నూతన సభ్యుల కోసం నిర్వహిస్తున్న పరీక్షలను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. చేపలు పట్టడం, వలలు విసరడం, ఈత కొట్టడం తదితర రంగాల్లో అవసరమైతే ముందస్తుగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలో దాదాపు 14 వేల మంది మత్స్యకారులు నూతనంగా సభ్యత్వం పొందేందుకు అర్హత కలిగి ఉన్నారన్నారు. జిల్లాలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, మత్స్యకారులకు నూతనంగా సభ్యత్వ నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మత్స్యకార సంఘాల సభ్యత్వం త్వరగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార సంఘాల్లో ఇప్పటికే నమోదైన 3 లక్షల 60 వేల మందితో పాటు నూతనంగా మత్స్యకార సంఘాల్లో నమోదయ్యే మత్స్యకారులందరికీ సామూహికంగా హైదరాబాద్లో సీఎం కేసీఆర్ ఫొటోతో డిజిటల్ గుర్తింపు కార్డులను ఫిబ్రవరిలో అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు ఎక్స్గ్రేషియాను అందించేందుకు మత్స్యశాఖ వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.