మెదక్, మే 6 (నమస్తే తెలంగాణ) : జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు సోమవారం మెదక్ సమీకృత కలెక్టరేట్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఎన్నికల సంఘం నియమావళికి లోబడి ఎంసీసీ, ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ), సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన, శిక్షణ శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఎన్నికలపై ఎంసీసీ, ఎంసీఎంసీ, పెయిడ్ న్యూస్, సోషల్ మీడియా అంశాలపై మాస్టర్ ట్రైనర్ ఆర్డీవో జయచంద్రారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాస్థాయిలో కలెక్టర్ చైర్మన్గా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీ చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ, అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేయడం, అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెకిస్తారన్నారు.
సోషల్ మీడియాలో అభ్యర్థులు ప్రకటనలకు ప్రి సర్టిఫికేషన్ అయిన తర్వాతే ప్రసారం చేయాలని, కేబుల్ చానెళ్లలో, సోషల్ మీడియాలో ప్రసారమయ్యే వార్తలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో 24×7 ఎంసీఎంసీ పర్య వేక్షిస్తుందని చెప్పారు. సోషల్ మీడియాగా పిలువబడే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ప్రసారమయ్యే వార్తలను సోషల్ మీడియా పర్యవేక్షణ బృందం నిత్యం పరిశీలిస్తూ, ఎంసీసీ నిబంధనలు అతిక్రమిస్తే సంబంధిత వ్యక్తులు, మీడియాపై కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. పోలింగ్కు ఒకరోజు ముందు, పోలింగ్ రోజు ఏదేని ప్రకటన ఇవ్వాల్సి ఉంటే కచ్చితంగా మీడియా సర్టిఫికేషన్ పొంది ప్రచురించాలన్నారు. అనంతరం మీడియా ప్రతినిధుల సందేహాలను మాస్టర్ ట్రైనర్ నివృత్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా మీడియా నోడల్ అధికారి రామచంద్ర రాజు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.