మెదక్ కలెక్టరేట్ ఎదుట గ్రామస్తులు, రైతులు ధర్నా
జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం
మెదక్, ఏప్రిల్ 11: మా గ్రామంలో స్థాపించబోతున్న క్లియో ఫార్మా మందుల కంపెనీ మాకొద్దంటూ గ్రామస్తులు, రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్లో నిర్మించబోయే క్లియో ఫార్మా కంపెనీతో జరిగే నష్టాలు, అనార్ధాలతో తీవ్రంగా నష్టపోతామని వాపోయారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, రైతులు మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో క్లీయో ఫార్మా కంపెనీ యాజమాన్యం ఫా ర్మా కంపెనీ స్థాపించుటకు అనుమతి కోసం సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకున్నారన్నారు.
వాటికి సంబంధించిన అనుమతి పత్రాలు సంబంధిత అధికారుల దగ్గర పెండింగ్లో ఉన్నాయని, ఒకవేళ కంపెనీకి అనుమతి లభించినట్లయితే ఆ ఫార్మా కంపెనీ విడుదల చేసే వ్యర్ధాలతో మా గ్రామంతో పాటు చుట్టు పక్కల పది గ్రామాలు పర్యావరణ సమతుల్యత,జీవవైవిద్యం దెబ్బతినడమే కాకుండా గాలి, నీరు కాలుష్యం అయ్యే ప్రమాదముందని పేర్కొన్నారు. రెండుసార్లు గ్రామ సభను నిర్వహించి ప్రజలందరూ పాల్గొని ఫార్మా కంపెనీ స్థాపనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశామన్నారు. కార్యక్రమంలో ఖాజాపూర్ సర్పంచ్తో పాటు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.