పూరి గుడిసెలు పోయి.. భవనాలు వెలిసే
నిర్మాణ దశలో 24 ఇండ్లు..
కాసులు కురిపిస్తున్న కురవగడ్డ భూములు
అప్పాజిపల్లి రూపు రేఖలు మార్చిన ఏడుపాయల బ్రిడ్జి
కొల్చారం, మే 23 : ఒకప్పుడు పూరి గుడిసెలతో నిత్యం ఏదో ఒకచోట నివాస గుడిసెలు తగులబడిపోయేవి. అగ్ని ప్రమాదాలతో కొంత మంది నిరాశ్రయులు కాగా, ఎంతో మంది తీవ్రంగా నష్టపోయేవారు. అలాంటి ఊరు రూపు రేఖలు.. తెలంగాణ ప్రభుత్వంలో మారిపోయాయి. ఏడుపాయల బ్రిడ్జి నిర్మాణంతో ఏడుపాయల్లో రోడ్డు చుట్టూ ఉన్న భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కొంత మంది రైతులు తమకున్న భూమిలో కొంత భాగాన్ని అమ్ముకొని భవనాలను నిర్మించుకుంటున్నారు. మెదక్-హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై ఉన్న కొల్చారం మండలంలోని అప్పాజిపల్లి నేడు బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలతో నూతన హంగులు సమకూర్చుకుంటున్నది. పాత ఇండ్లను కూల్చివేసి కొత్త భవనాలు నిర్మించుకుంటున్నారు. రోజు రోజుకూ ఇండ్ల నిర్మాణం జోరుగా సాగుతుండడంతో ఊరు రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 24 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి.
కురవగడ్డ భూముల ధరలకు రెక్కలు
తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వన దుర్గా భవానీ దేవస్థానానికి వచ్చేందుకు కొల్చారం మండలంలోని పోతంశెట్పల్లి చౌరస్తా సమీపంలోని మంజీరా నదిపై రూ.24 కోట్లతో ఏడేండ్ల కింద ఏడుపాయల బ్రిడ్జి, రోడ్డు మంజూరైంది. మంజీరానదిపై మూడు చోట్ల బ్రిడ్జి నిర్మాణం, రోడ్డు పనులు పూర్తి కాగా, బ్రిడ్జిల మధ్య ఉన్న కురవగడ్డ, టేకులబొడ్డె ప్రాంత భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పట్లో ఎలాంటి రోడ్డు సౌక ర్యం లేని భూములను అప్పాజిపల్లి గ్రామస్తులు మంజీరానది ప్రవాహంపై పుట్టి(నాటు పడవ) వేసుకుని వెళ్లి పంటలు సాగు చేసేవారు. బ్రిడ్జి నిర్మాణంతో పాటు రోడ్డు సౌకర్యం సమకూరడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ప్రాంతంపై దృష్టి సారించారు. ఇక్కడ భూముల ధరలు విపరీతంగా పెరగడంతో పలువురు అధిక ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. దీంతో అప్పాజిపల్లిలో ఇండ్ల నిర్మాణం జోరుగా కొనసాగుతున్నది.
మంచి ఇల్లు కట్టుకుంటున్నా..
ఏడుపాయల బ్రిడ్జిల మధ్య కురవగడ్డపై ఉన్న భూమిలో కొంత భూమిని అమ్ముకోగా, రూ. 20 లక్షలు వచ్చాయి. దీంతో ఇల్లు కట్టుకుంటున్నా. కురవగడ్డపై 80 మంది వరకు అప్పాజిపల్లి గ్రామస్తులకు పట్టా భూములున్నాయి. కొంత మంది మాత్రమే ఇంటి నిర్మాణాలకు కొంత మేర భూములను అమ్ముకొని నచ్చిన రీతిలో ఇండ్లు కట్టుకుంటున్నారు. -జోగు నర్సింహులు, అప్పాజిపల్లివాసి
ఇండ్ల నిర్మాణంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది..
ఏడుపాయల బ్రిడ్జి నిర్మాణంతో కురవగడ్డ భూములకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. గ్రామస్తులు కొంత మేర భూములను అమ్ముకొని ఊర్లో కొత్త ఇండ్లను నిర్మించుకుంటున్నారు. దీంతో ప్రభుత్వానికి ట్యాక్స్, బెటర్మెంట్, డెవలప్మెంట్ చార్జిల కింద భారీగా ఆదాయం సమకూరుతుంది. గ్రామ రూపురేఖలు మారిపోతున్నాయి. ఊర్లో గుడిసె అనేది లేకుండా అయ్యింది.
–ఝాన్సీలక్ష్మి, సర్పంచ్, అప్పాజిపల్లి