మెదక్ అర్బన్, జూలై 31: ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా 33 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించామని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి అన్నా రు. ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వికసించి ప్రకాశించాల్సిన బాల్యాన్ని కొందరు స్వార్థంతో బండబారుస్తున్నారని అన్నారు. బడికి వెళ్లాల్సిన బాలలు కష్టమైన పనుల్లో ఉండడం సమాజాభివృద్ధికి ఆటంకమని అన్నారు.
జాతిని సవాలు చేస్తున్న బాలకార్మిక సమస్య ఇంకనూ కొనసాగుతూనే ఉందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతూనే ఉందన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి మెదక్ జిల్లా ఆపరేషన్ ముస్కాన్ పోలీస్ బృందం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, సఖీ సెంటర్, ఎడ్యుకేషన్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్, వివిధ డిపార్టెంట్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-8 బృందం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కిరాణాదుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లలో పనిచేస్తూ, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న 33 మంది పిల్లలను పట్టుకున్నట్లు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారికి అప్పగించారు. బాలలను పనిలో పెట్టుకున్న వారిపై 8 కేసులు నమోదు చేశారు. వీధి బాలలను చూసినప్పుడు 1098, డయల్ 100, 112 సమాచారం అందించాలని సూచించారు.