మెదక్ అర్బన్, ఏప్రిల్ 10: వసతి గృహంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో మెదక్ పట్టణంలోని నర్సింగ్ కశాశాల విద్యార్థినులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్కు వినతిపత్రం అందజేశారు. ఎండలో ర్యాలీగా విద్యార్థినులు చమాన్ చౌరస్తా వద్దకు రాగా అధికారులు కల్పించుకొని అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు అర్టీసీ బస్సులో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ వసతి గృహంలో 120 మంది ఉంటే ఒక మరుగుదొడ్డి, మూత్రశాల ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.
పలుమార్లు ప్రిన్సిపాల్కు సమస్య తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. రాత్రి సమయంలో పాములు గదుల్లోకి వస్తున్నాయని, అధికారులకు తెలిపిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. నర్సింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం రూ. 20 వేలు తీసుకుంటున్నారని, వసతి గృహంలో ఉండేందుకు ప్రతి నెల రూ. 6 వేలు చెల్లిస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన ఉపకార వేతనాలు చెల్లించడం లేదన్నారు. నర్సింగ్ కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.