మెదక్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాజకీయాల్లో మెతుకు సీమ ప్రత్యేక గుర్తింపు పొందింది. మెదక్, హవేళీఘనపూర్ మండలాల్లోని పలు గ్రామాలు, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, రేగోడ్లోని కొన్ని గ్రామాలను కలిపి మెదక్ నియోజకవర్గంగా 1952లో ఏర్పాటు చేశారు. 2009లో పునర్విభజనలో భాగంగా రామాయంపేట నియోజకవర్గాన్ని రద్దు చేసి మెదక్లో కలిపారు. మెదక్ నియోజకవర్గంలో మెదక్, రామాయంపేట, చిన్నశంకరంపేట, పాపన్నపేట మండలాలు కలిశాయి. ఆందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలను కలిపారు. పెద్దశంకరంపేట మండలాన్ని నారాయణఖేడ్ మండలంలో కలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత 2016లో నూతన జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మెదక్ కేంద్రంగా జిల్లా ఏర్పాటయ్యింది. కొత్తగా హవేళీఘనపూర్, నిజాంపేట మండలాలు ఏర్పాటయ్యాయి. నార్సింగి మండలంలోని నాలుగు గ్రామాలు ఇందులో కలిశాయి. ఇప్పటికే మెదక్ మున్సిపాలిటీ ఉండగా, కొత్తగా రామాయంపేట మున్సిపాలిటీని 2019లో ఏర్పాటుచేశారు.
మెదక్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు శాసన సభకు ఎన్నికలు జరిగాయి. 1952, 1957లో వెంకటేశ్వర్రావు (కాంగ్రెస్), 1962లో ఆనందాదేవి (సీపీఐ), 1967లో రాంచంద్రారెడ్డి (కాంగ్రెస్), 1972లో స్వతంత్ర అభ్యర్థి కరణం రామచందర్రావు గెలుపొందారు. 1978లో ఎస్.లక్ష్మారెడ్డి (కాంగ్రెస్), 1983, 1985లో కరణం రామచంద్రరావు (టీడీపీ) గెలిచారు. 1989లో నారాయణరెడ్డి (కాంగ్రెస్), 1994, 1999లో కరణం రామచంద్రరావు (టీడీపీ) విజయం సాధించారు. 2002 ఉప ఎన్నికల్లో ఉమాదేవి (టీడీపీ) గెలిచారు. 2004లో జనతా పార్టీ నుంచి పి.శశిధర్రెడ్డి గెలుపొందారు. 2009లో మైనంపల్లి హన్మంతరావు (టీడీపీ) గెలిచారు. 2014, 2018లో బీఆర్ఎస్ నుంచి ఎం.పద్మాదేవేందర్రెడ్డి వరుసగా రెండుసార్లు గెలుపొందారు. మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపారు.
మెదక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వరుసగా మూడోసారి బరిలోకి నిలిచారు. మెదక్లో హ్యాట్రిక్ కొట్టేందుకు పావులు కదుపుతున్నారు. 2014 ఎన్నికల్లో 39,600 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతిపై ఘన విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అమ్మారెడ్డి ఉపేందర్రెడ్డిపై 47,983 ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
మెదక్ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. ఇప్పటి వరకు అసెంబ్లీకి 16 సార్లు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఆరు సార్లు (టీడీపీ), ఐదు సార్లు (కాంగ్రెస్), రెండు సార్లు (బీఆర్ఎస్) పార్టీలకు చెందిన వారు ప్రాతినిధ్యం వహించారు. జనతా పార్టీ, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోసారి గెలుపొందారు. 1972లో కరణం రామచంద్రరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2002లో మంత్రిగా కొనసాగిన కరణం రామచంద్రరావు మరణంతో ఉప ఎన్నికల్లో కరణం భార్య ఉమాదేవి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2004లో జనతా పార్టీ నుంచి పట్లోళ్ల శశిధర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో టీడీపీ నుంచి మైనంపల్లి హన్మంతరావు గెలుపొందగా, 2014లో బీఆర్ఎస్ నుంచి పద్మాదేవేందర్రెడ్డి విజయం సాధించి శాసన సభ తొలి డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు. అనంతరం 2018లో కూడా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రెండోసారి గెలుపొందారు.