సిద్దిపేట అర్బన్, నవంబర్ 24 : ప్రతి సామాన్య పౌరుడు విజ్ఞానం పెంచుకొని ఉన్నత స్థానానికి ఎదగడానికి గ్రంథాలయం ఎంతో దోహదపడుతుంది. పుస్తక పఠనం ద్వారా ఏదైనా సాధించవచ్చని గ్రహించిన మన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక యాజమాన్యం సామాన్య ప్రజలకు చేరువలో గ్రంథాలయాన్ని నిర్మించాలని సంకల్పంచింది. సిద్దిపేట పట్టణ పరిధిలోని కేసీఆర్నగర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయంలో గ్రంథాలయాన్ని నిర్మించింది. ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న ఈ క్రమంలో గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ ప్రాంతంలో నివసించే యువతకు, ప్రభుత్వ ఉద్యోగార్థులకు ‘నమస్తే తెలంగాణ’ గ్రంథాలయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే ‘నమస్తే తెలంగాణ’ గ్రంథాలయం నిర్మాణం పూర్తి కాగా, త్వరలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఈ లైబ్రరీ ప్రారంభం కానున్నది.
ఆధునిక సౌకర్యాలతో కూడిన గ్రంథాలయం
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో ఉచితంగా నిర్మించి అందించిన 2 వేల పైచిలుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఆధునిక హంగులతో 1450 చదరపు అడుగుల స్థలంలో లైబ్రరీని నిర్మించారు. సిద్దిపేట పట్టణ పరిధిలోని కేసీఆర్నగర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయంలో ‘నమస్తే తెలంగాణ’ సౌజన్యంతో బాలివికాస, పౌలోమి కంపెనీ వారి ఆధ్వర్యంలో ఈ గ్రంథాలయాన్ని నిర్మించారు. ఆధునిక సౌకర్యాలు ఈ గ్రంథాలయంలో ఏర్పాటు చేశారు.
ఒక లైబ్రరీ, కంప్యూటర్ రూమ్తో పాటు మల్టీపర్పస్ హాల్, కోర్టు యార్డును నిర్మించారు. మల్టీపర్పస్ హాల్లో 50 నుంచి 80 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. లైబ్రరీలో పాఠకులు చదువుకోవడానికి వీలుగా బీరువాలను, కుర్చీలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం తెలుగు అకాడమీతో పాటు ఇతర పబ్లికేషన్లకు సంబంధించిన పుస్తకాలను లైబ్రరీలో అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి, పుస్తక ప్రియులకు ఈ గ్రంథాలయం ఓ వరంలాంటిదని చెప్పవచ్చు.