మెదక్ అర్బన్/ రామాయంపేట, ఆగస్టు 26: కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పరీక్ష ఏర్పాట్లపై వివరాలు తెలిపారు. రేపు నిర్వహించబోయే ప్రిలిమినరీ పరీక్షను మెదక్ జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 8821 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మెదక్ పట్టణంలో 17 పరీక్షా కేంద్రాలు, నర్సాపూర్లో 5, రామయంపేటలో 4, చేగుంటలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకోనున్నారు. పరీక్ష సమయాని కంటే గంట ముందుగానే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుంది.
ఉదయం 10 గంటల తర్వాత అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. నిమిషం నిబంధన అమలులో ఉంటుంది కాబట్టి అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని ఎస్పీ సూచించారు. పరీక్షకు సంబంధించిన నిబంధనలు పూర్తిగా హాల్ టికెట్లో పొందుపర్చి ఉంటాయి. హాల్టికెట్పైన అభ్యర్థులు పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఉండాలి. పరీక్ష విధానం పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రం చుట్టూ పోలీసులు 360 డిగ్రీల్లో బందోబస్తు, ప్రధాన గేట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. రాత పరీక్ష పూర్తిగా రీజినల్ కో-ఆర్డినేటర్ మెదక్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గణపతి, నోడల్ ఆఫీసర్ జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి, పోలీస్ బయోమెట్రిక్ అధికారి రవీందర్ సీఐడీసీబీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారని, ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్నా వారి దృష్టికి తీసుకెళ్లవచ్చని సూచించారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్…
జిల్లాలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అమలులో ఉంటుంది. పరీక్ష కేంద్రాల వద్ద ఉన్నటువంటి అన్ని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్స్, చుట్టు పక్కల లౌడ్ స్పీకర్లు మూసివేయాలని, 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడవద్దని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
సంగారెడ్డి జిల్లాలో 43 పరీక్షా కేంద్రాలు
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 26: పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు జరుగనున్న పరీక్షకు సంగారెడ్డి జిల్లాలో 43 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, జిల్లావ్యాప్తంగా 18,451మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష నోడల్ అధికారిగా జహీరాబాద్ డీఎస్పీ రఘును నియమించారు. సంగారెడ్డిలో-20, పటాన్చెరు-8, సదాశివపేట-7, రుద్రారం, మల్కాపూర్, ఎంఎన్ఆర్, శివ్వంపేట, సుల్తాన్పూర్ (జేఎన్టీయూ) ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అభ్యర్థుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
ఆదివారం జరుగనున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ఆయా పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు సంగారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఈవీ సత్యనారాయణ తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. 30 మంది అభ్యర్థులు జమకూడి కోరితే పరీక్ష కేంద్రానికి నేరుగా తీసుకెళ్లి తీసుకువస్తామన్నారు. అభ్యర్థుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అధికారులను అందుబాటులో ఉంచనున్నారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం పరీక్ష అనంతరం తిరుగు ప్రయాణం పూర్తయ్యే వరకు ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంటారు. ఇతర వివరాల కోసం సంగారెడ్డి డిపో-85003 76276, 98496 83483, జహీరాబాద్ డిపో-91542 98656, 73829 24743, సదాశివపేట-95816 80533, పటాన్చెరు బస్స్టేషన్-9704885694 నంబర్లను సంప్రదించాలని కోరారు. అభ్యర్థులు ఆర్టీసీ సేవలను వినియోగించుకొని సకాలంలో పరీక్షకు హాజరు కావాలని కోరారు.
నాలుగు సెంటర్లలో పటిష్ట భద్రత
రామాయంపేటలో జరిగే నాలుగు పరీక్షా కేంద్రాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తాం. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు సమగ్ర చర్యలు చేపడుతున్నాం.
– చంద్రశేఖర్రెడ్డి, సీఐ, రామాయంపేట
అన్ని ఏర్పాట్లు చేశాం
రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, టీఎస్ మాడల్ స్కూల్, స్నేహ కళాశాల, తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్షలను ఏర్పాటు చేశాం. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.
– కృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్, రామాయంపేట ప్రభుత్వ కళాశాల