సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు19: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఫొటో జర్నలిస్టులు తీసిన విభిన్న చిత్రాలను కలెక్టరేట్లో ప్రదర్శించారు. ఈ చాయా చిత్ర ప్రదర్శనను కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్, అదనపు కలెక్టర్ రాజర్షిషాతో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వంద కథనాలు వివరించే సారంశాన్ని ఒక ఫొటో తెలియజేస్తుందని అన్నారు. చాయా చిత్రానికి ప్రత్యేకత ఉన్నదన్నారు. ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటో జర్నలిస్టులు, ఫొటో గ్రాఫర్లకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జిల్లాలో పెద్దఎత్తున నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీకి సంబంధించిన ఫొటోను నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ సాయిలు తన కెమెరాలో చక్కగా బంధించారని కలెక్టర్ అభినందించారు. సంబంధిత ఫొటోను సాయిలు కెమెరాలో చూసి వెంటనే రూ.10 వేల నగదు పురస్కారాన్ని ప్రకటించారు. ఇలాంటి చిత్రాలు సమాజానికి అందించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. అనంతరం ఫొటో జర్నలిస్టులను కలెక్టర్ శాలువా, మెమొంటోలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఫొటోగ్రాఫర్లకు హెల్త్కార్డులు అందజేత
పటాన్చెరు, ఆగస్టు 19: ఒక్క ఫొటో లక్ష భావాలకు ప్రతి రూపమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధుముదిరాజ్ అన్నారు. మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం నిర్వహించారు. 73 మంది ఫొటోగ్రాఫర్ల కుటుంబాలకు నీలం మధు ముదిరాజ్ ఆరోగ్య బీమా చేయించి కార్డులు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రతి సంఘటనకు సాక్ష్యంగా ఫొటోలు నిలిచాయన్నారు. ప్రత్యేక రాష్ట్ర కాంక్షను చాటే ఫొటోలు ఉద్యమాన్ని ప్రజల గుండెల్లో నిలిచేలా చేశాయన్నారు.
ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విరివిగా ప్రచారం చేసేలా ఫొటోగ్రాఫర్లు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. ప్రతి నాయకుడి జీవిత ప్రయాణంలో ఫొటోగ్రాఫర్లు వెంట ఉంటారనేది సత్యమని నీలం మధు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పీ.నారాయణరెడ్డి, చిట్కుల్ ఉప సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి, దుర్గయ్య, భుజంగం, మురళీ, వెంకటేశ్, రాజ్కుమార్, పటాన్చెరు నియోజకవర్గం ఫొటోగ్రఫీ సంఘం అధ్యక్షుడు కృష్ణయాదవ్, ఇస్నాపూర్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సుధాకర్, రవీందర్, నరేందర్, నగేశ్, గుమ్మడిదల, బొంతపల్లి, జిన్నారం ఫొటో, వీడియో గ్రాఫర్ల సంఘం సభ్యులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.