జహీరాబాద్, ఆగస్టు 19: ఖనిజాలు తవ్వకాలు చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయాలు సేకరిస్తుందని సంగారెడ్డి అదరనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. శుక్రవారం జహీరాబాద్ మండలంలోని గోవింద్పూర్లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వారు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. పృథ్వీ ఇన్ఫ్రా, డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు గోవింద్పూర్ శివారులో 25 ఎకరాల్లో ఎర్ర మట్టి ఖనిజాలు తవ్వకాలు చేసేందుకు గ్రామస్తుల అభిప్రాయాలు సేకరిస్తుందన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సేకరించిన ప్రజాభిప్రాయాలు భారత కాలుష్య నియంత్రణ మండలికి పంపిస్తామన్నారు. గ్రామస్తులు, ఎన్జీవోలు తమ అభిప్రాయలు తెలుపాలన్నారు. దీంతో గ్రామస్తులు మాట్లాడుతూ గోవింద్పూర్లో పృథ్వీ ఇన్ఫ్రా, డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వరాదని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామానికి సమీపంలోని 25 ఎకరాల్లో ఎర్ర మట్టి తవ్వకాలు చేస్తే కాలుష్య సమస్య, గ్రామానికి ప్రమాదం ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా, గోవింద్పూర్లో ఖనిజాలు తవ్వకాలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని పలు ఎన్జీవోల ప్రతినిధులు కోరారు. పరిశ్రమ ఏర్పాటుతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సమావేశంలో జహీరాబాద్ ఆర్డీవో రమేశ్బాబు, కాలుష్య నియత్రణ మండలి ఈఈ గీతా సహర్, తహసీల్దార్ నాగేశ్వర్రావు, చిరాగ్పల్లి ఎస్ఐ కాశీనాథ్, కాలుష్య నియంత్ర మండలి అధికారులు, ఎన్జీవోల ప్రతినిధులు, గ్రామ సర్పంచ్ రాజు, టీఆర్ఎస్ నాయకులు తాజోద్దీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.