పటాన్చెరు/సిర్గాపూర్, ఆగస్టు19: గైనకాలజీ సమస్యలతో అనారోగ్యం బారిన పడిన విద్యార్థిని తీవ్ర అస్వస్థతతో మృతి చెందిన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పటాన్చెరు పోలీసులు, కళాశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తంగి గ్రామ పరిధిలోని మహాత్మా జ్యోతి బాఫూలే ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సిర్గాపూర్ మండలం లొంకతండాకు అఖిల(17) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నది. శుక్రవారం తెల్లవారుజామున విద్యార్థులతో పాటు కాలకృత్యాలకు లేచింది. వాష్రూంలో కడుపు నొప్పితో రోదిస్తున్న అఖిలను తోటి విద్యార్థినులు బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమె సృహ తప్పి పడిపోయింది. దీంతో వెంటనే హాస్టల్ సిబ్బంది పటాన్చెరు ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉందని గుర్తించిన డాక్టర్లు అఖిలను నగరంలోని గాంధీ దవాఖానకు తరలించాలని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యలో అఖిల మృతి చెందింది. అఖిల చురకైన విద్యార్థి అని, రాత్రి కూడా చక్కగా చదువుకున్నదని అధ్యాపకులు, హాస్టల్ సిబ్బంది తెలిపారు. అఖిలకు గైనకాలజీకి సంబంధించిన సమస్య ఉన్నదని, దానికి గత నెలలో చికిత్స కూడా పొందిందని డ్యూటీ నర్సులు తెలిపారు. సమస్య ప్రాణం తీసేంతగా ఉంటుందని తాము ఊహించలేదని టీచర్లు ఆవేదన వ్యక్తంచేశారు.
పోలీసులకు ఫిర్యాదు
అఖిల తండ్రి నెనావత్ గోపాల్ తన కూతురి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాలేజీ సిబ్బంది తెల్లవారు జామున 4.30కి తనకు ఫోన్ చేసి అఖిల కడుపు నొప్పితో వాష్రూంలో పడిపోయిందని, దవాఖానకు తరలిస్తున్నామని చెప్పారన్నారు. ఉదయం 6.30కి మళ్లీ ఫోన్ చేసి అఖిల మరణించిందని చెప్పారని వాపోయాడు. గాంధీ దవాఖానలో తన కూతురు మృతదేహాన్ని పెట్టారని, తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. తన కూతురు అకాల మరణంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ఎస్సై దుర్గయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.