మెదక్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ):రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ప్రజా సంక్షేమ కార్యక్రమాల ప్రగతిలో మెదక్ జిల్లా అగ్రగామిగా నిలుస్తున్నదని పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన 75వ స్వాతంత్య్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు 12,141 కొత్త పింఛన్లు మంజూరయ్యాయని, దళితబంధు పథకం కింద 256 మంది లబ్ధిదారులకు రూ.21 కోట్ల 68 లక్షలు అందించామన్నారు. ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో మొత్తం 313 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. నీటిపారుదల శాఖకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, చెరువులు, ప్రాజెక్టుల పునరుద్ధరణ, మరమ్మతులకు కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు. 3977 రైతులు మరణించగా, రైతుబంధు పథకం కింద రూ.198.85 కోట్లు వారి కుటుంబాల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిలో మెదక్ జిల్లా అగ్రగామిగా నిలుస్తున్నదని రాష్ట్ర పశువైద్య, పశు సంవర్ధక, పరిశ్రమాభివృద్ధి, మత్య్స, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవాలను మెదక్ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించి, జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో ఎంతోమంది తమ ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడారన్నారు. రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరిచిపోమని.. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
కొత్తగా 20,528 పింఛన్లు మంజూరు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మెదక్ జిల్లాకు 12,141 మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయన్నారు. వీటితో పాటు వృద్ధాప్య పింఛన్లు 1579, వితంతు 4255, దివ్యాంగులు 242, చేనేత 8, గీత కార్మికులు 114, బీడీ కార్మికులు 1746, ఒంటరి మహిళలు 149, పైలేరియా పింఛన్లు 24 మొత్తం 20,528 మంజూరయ్యాయి. మెదక్ నియోజకవర్గంలో 8438, నర్సాపూర్కు 5616, ఆందోల్కు 2127, గజ్వేల్కు 1465, దుబ్బాకకు 1587, నారాయణఖేడ్కు 1025 పింఛన్లు మంజూరయ్యాయి.
దళితుల ఆర్థికాభివృద్ధికి దళిత బంధు
దళితులు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. వారు ఎంపిక చేసుకున్న స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందేలా తోడ్పాటునందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద జిల్లాలో 256 మంది లబ్ధిదారులకు రూ.21 కోట్ల 68లక్షలు అందజేసినట్లు తెలిపారు. ఇతర స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సాయంగా 279 మంది లబ్ధిదారులకు రూ.4.86 కోట్ల సబ్సిడీ రుణాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పాడి గేదెల పథకం కింద ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గానికి 300 యూనిట్ల చొప్పున మండల స్థాయిలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు.
మన ఊరు- మనబడిలో 313 పాఠశాలల ఎంపిక
మన ఊరు- మనబడి కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో 313 పాఠశాలలు ఎంపిక చేసి, ఇప్పటివరకు 311 పాఠశాలల అభివృద్ధి పనులు ప్రారంభించిందని మంత్రి తెలిపారు. అందులో 204 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయని, 164 పాఠశాలలకు అడ్వాన్స్గా నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఈసారి పదో తరగతి ఫలితాల్లో మెదక్ జిల్లా 11వ స్థానంలో నిలిచిందన్నారు. కేసీఆర్ కిట్ పథకంలో ప్రభుత్వ దవాఖానలో ప్రసవించిన తల్లికి వాయిదా పద్ధతిలో మగ బిడ్డ జన్మిస్తే రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. మొదటి, రెండో కాన్పులకు కేసీఆర్ కిట్ అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఈ పథకంలో ఇప్పటివరకు 26,457 మందికి కేసీఆర్ కిట్లు అందజేసినట్లు తెలిపారు. రూ.29.8 కోట్ల ఆర్థిక సాయం అందజేశామన్నారు.
వ్యవ‘సాయం’ ఘనం
మిషన్ కాకతీయలో భాగంగా జిల్లాలో 3070 చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు, ఆనకట్టలు ఉన్నట్లు గుర్తించామన్నారు. జిల్లాలో కాళేశ్వరం నీళ్లు కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా 66,452 ఎకరాలకు, మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా 1,33,462 వేల ఎకరాలకు అందుతున్నాయన్నారు. ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంచేందుకు ప్రభుత్వం రూ.43.6 కోట్లు మంజూరు చేసిందన్నారు. దీంతో మరో 27 వేల ఎకరాలకు నీరు అందనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా జిల్లాలోని 20 మండలాల్లోని 469 పంచాయతీలకు రూ.668 కోట్లతో పనులు చేపట్టారన్నారు. జిల్లాలో దాదాపు 1.84 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చి, నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రైల్వే రేక్ పాయింట్ను ప్రారంభించామని, దీంతో రైతులకు కావాల్సిన ఎరువులు సకాలంలో అందుతాయని అన్నారు.
రవాణా ఖర్చులు తగ్గడంతో రైతులపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. జిల్లాలో రైతు బంధు పథకం కింద 2. 59లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.199 కోట్లు జమచేసినట్లు తెలిపారు. రైతు బీమా కింద ఇప్పటి వరకు మరణించిన 987 మంది రైతుల కుటుంబాలకు రూ.49.35 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. పాడి పశువుల పంపి ణీ పథకం కింద జిల్లాలో 3044 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారని, 1193 మందికి రూ.5.44 కోట్ల సబ్సిడీతో పాడి పశువులు పంపిణీ చేశామని తెలిపారు. జిల్లాలోని 1614 చెరువుల్లో 5 కోట్ల 4 లక్షల చేప పిల్లలు వందశాతం సబ్సిడీతో వదలనున్నామన్నారు. దీంతో 263 మత్య్స సహకార సంఘాల్లోని 15754 మంది సభ్యుల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందన్నారు.
మహిళా, రైతు సంఘాలకు చేయూత
2022-23 సంవత్సరానికి బ్యాంక్ లింకేజీతో 11,486 సంఘాలకు రూ.491.85 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్ధేశించామన్నారు. 2177 సంఘాలకు రూ.116.08 కోట్ల రుణాలు అదజేసినట్లు పేర్కొన్నారు. స్త్రీనిధితో ఈ సంవత్సరం రూ.114 కోట్లు అందించాలని లక్ష్యంగా సాగుతున్నామన్నారు. అల్లాదుర్గం, రేగోడ్, పెద్దశంకరంపేట, టేక్మాల్ మండలాల్లోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, అల్లాదుర్గం మండల కేంద్రంగా కంపెనీని ఏర్పాటు చేసి ఇప్పటివరకు 140 టన్నుల ఉల్లిగడ్డను నేరుగా మార్కెట్ ధరకు కొని బిగ్ బాస్కట్, నింజకార్డ్ వంటి పెద్ద వ్యాపార సంస్థలకు అమ్మినట్లు తెలిపారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
సోమవారం మెదక్ కలెక్టరేట్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థుల నృత్యం సభికులను ఆకట్టుకున్నది. గీతా స్కూల్, గురుకుల పాఠశాల, సిద్ధార్థ్ మోడల్ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక పరదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలత, జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, ఆర్డీవో సాయిరాం, తహసీల్ధార్ కె.శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.