సంగారెడ్డి ఆగస్టు15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సీఎం కేసీఆర్ నూతన ఒరవడికి నాంది పలికారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం నూతన పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. అధికారులు ఎంపిక చేసిన ముగ్గురు ఆసరా పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖాల మంత్రి హరీశ్రావు నేతృత్వంలో జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. జిల్లాలో కొత్తగా 41,981 మందికి పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కొత్త పింఛన్ల మంజూరుతో ప్రభుత్వంపై రూ.102 కోట్ల అదనపు భారం పడుతున్నదన్నారు. జిల్లాలో ఇది వరకే ప్రతి నెలా రూ.30 కోట్లతో 1.32 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారన్నట్లు తెలిపారు.
రూ.4427 కోట్లతో ఎత్తిపోతల పథకాలు
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతోపాటు సాగునీరు, వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని రైతాంగానికి సాగు నీటి సమస్య తీర్చేందుకు సీఎం కేసీఆర్ రూ.4427 కోట్లతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీటితో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రైతుబంధు పథకంలో తొమ్మిది విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.2889 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. వానకాలంలో 3.34 లక్షల రైతుల ఖాతాల్లో రూ.371 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. రైతుబీమా పథకంలో 5372 మంది రైతుల నామిని ఖాతాల్లో రూ.268.60 కోట్లు జమ చేశారన్నారు. రబీ సీజన్లో రైతులు పండించిన 75వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రైతులకు రూ.146 కోట్లు చెల్లించారన్నారు.
దళితబంధు పథకంలో 444 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 382 యూనిట్లను గ్రౌండింగ్ చేసినట్లు మంత్రి తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా రూ.524 కోట్లతో 943 నివాస ప్రాంతాల్లో ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ పట్టణాల్లో రూ.83 కోట్లతో తాగునీటి సరఫరా వ్యవస్థను ఆధునీకరించినట్లు చెప్పారు. హరితహారంలో భాగంగా జిల్లాలో 49.56 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. అన్ని పంచాయతీల్లో పల్లెప్రకృతి, మండల కేంద్రాల్లో బృహాత్ పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
సంక్షేమంలో దూసుకెళ్తున్న ప్రభుత్వం
గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 1704 మంది లబ్ధిదారులకు రూ.4.19 కోట్లు అందజేశామన్నారు. బీసీ సంక్షేమశాఖ ద్వారా 36,336 మంది లబ్ధిదారులకు రూ.31.50 కోట్లు ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. జిల్లాలో 2442 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తిచేశామన్నారు. ఉపాధి హామీ పథకంలో 48 వేల మందికి పనులు కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో 147 క్రీడాప్రాంగణాలు, గ్రామాల్లో 743 క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 540 క్రీడా ప్రాంగణాల పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. టీఎస్ఐపాస్ ద్వారా జిల్లాలో 479 కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు.
నారాయణఖేడ్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి జిల్లాకు రూ.527 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో మున్సిపాలిటీలు, పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలోని 12,384 మహిళా సంఘాలకు రూ.673 కోట్ల రుణాలు, మున్సిపాలిటీల్లో 345 సంఘాలకు రూ.29 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందజేశారన్నారు.
విద్యా వైద్య రంగాలకు పెద్దపీట
విద్యా వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ అంత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు చేశారన్నారు. సంగారెడ్డిలో రూ.510 కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం 150 మంది వైద్య విద్యార్థులతో తరగతులు ప్రారంభించన్నట్లు తెలిపారు. వైద్య కళాశాలకు అనుబంధంగా 630 పడకల దవాఖానను మంజూరు చేశారన్నారు. 100 సీట్లతో నర్సింగ్ కాలేజీ మంజూరు చేసినట్లు చెప్పారు. కొత్తగా 13 బస్తీ దవాఖానలు ప్రారంభించారన్నారు. పటాన్చెరు దవాఖానలో కొత్తగా డయాగ్నస్టిక్ హాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా జిల్లాలో రూ.172 కోట్లతో 441 పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.