పటాన్చెరు, ఆగస్టు 15ః స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసేందుకు పోల్ను నిలబెట్టే క్రమంలో పైనున్న11కేవీ విద్యుత్ తీగలు తగిలి కరెంట్షాక్తో ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరొకరు గాయాలకు గురై చికిత్స పొందుతున్నారు. పటాన్చెరు పోలీసుల కథనం ప్రకారం మండలం ఇంద్రేశం గ్రామం ఆనంద్నగర్ కాలనీలో యాదాద్రి జిల్లా, టంగుటూర్కు చెందిన పూజారి అనీల్గౌడ్(40) ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఏపీ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతయ్య (50) మేస్త్రీగా చేస్తూ ఇదే కాలనీలో నివసిస్తున్నాడు. సోమవారం ఆనంద్నగర్ కాలనీలో పంద్రాగస్టు సందర్భంగా జెండాను ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జెండా పోల్ను నిలబెట్టే క్రమంలో 11కేవీ తీగలు జెండాకు తగిలాయి.
దీంతో పోల్ని పట్టుకున్న అనిల్గౌడ్, తిరుపతయ్యలు అక్కడికక్కడే కరెంట్ షాక్తో మృతి చెందారు. ధనుంజయ్ అనే వ్యక్తికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. వీరిని పటాన్చెరులోని ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే ఇద్దరు మృతి చెందారని తెలిపారు. మరొకరికి చికిత్స అందజేస్తున్నారు. స్వాతంత్య్ర సంబురాల్లో విద్యుతాఘాతం తెచ్చిన విషాదంతో ఆ కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యాయి. ఈ మేరకు సంఘటనా స్థలాన్ని పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి పరిశీలించారు. పటాన్చెరు సీఐ వేణుగోపాల్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ పరంగా ఆదుకుంటాంః పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
జాతీయ జెండా ఎగురవేసే క్రమంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటనపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని, ప్రైవేటు దవాఖానను సందర్శించి మృతదేహాలను పరిశీలించారు. అనీల్గౌడ్, తిరుపతయ్య కుటుంబాలకు ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని ఎమ్మెల్యే వారికి హామీఇచ్చారు. మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సూచించారు.