సంగారెడ్డి/మెదక్ న్యూస్ నెట్వర్క్ ఆగస్టు 15;మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, రహదారులు, వ్యాపార సముదాయాలు త్రివర్ణ శోభితమయ్యాయి. సోమవారం నిర్వహించిన 75వ స్వాతంత్య్ర వేడుకలు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మిన్నంటాయి. పల్లెలు, పట్టణాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జెండావిష్కరణలు చేయగా, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారీ జాతీయ జెండాలతో యువత ర్యాలీలు తీశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. పలుచోట్ల పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
మెదక్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సంగారెడ్డిలో హోం మంత్రి మహమూద్ అలీ ప్రందాగస్టు కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుని నివాళులర్పించారు. వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. వనదుర్గాభవానీమాతను జాతీయ పతాక రూపంలో మూడు రంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించడంతో భక్తులు పులకించిపోయారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు జెండావిష్కరణలు చేశారు.
మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆయా సంఘాల భవనాల వద్ద నిర్వహించిన వేడుకలతో వీధులన్నీ త్రివర్ణ శోభితమయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని పరేడ్ గ్రౌండ్, మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన 75వ వేడుకలకు హోంమంత్రి మహమూద్ అలీ, పశువైద్య, పశు సంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్య్స, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిల తలసాని శ్రీనివాస్ యాదవ్ వేర్వేరుగా ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. దేశభక్తిని చాటిచెప్పే గీతాలకు వారు చేసిన నృత్యాలు వీక్షకులతో చప్పట్లు కొట్టించాయి.
సేవకు ప్రశంస..
స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్లో సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ చేతుల మీదుగా సిద్దిపేట మోహిన్పుర వెంకటేశ్వర ఆలయ ఈవో విశ్వనాథశర్మ ఉత్తమ సేవ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.