మెదక్, ఆగస్టు14 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు మెదక్ కలెక్టరేట్ సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ద్విసప్తాహ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అధికారులు రోజువారీగా కార్యాచరణ రూపొందించారు. జిల్లాలోని ప్రతి ఇంటిపై మువ్వెన్నెల జెండాను ఎగురవేశారు. జాతీయ పతాకాలను ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లాలో ఎంపిక చేయబడిన థియేటర్లలో విద్యార్థులకు మహాత్మా గాంధీ చిత్రాలు ప్రదర్శిస్తున్నారు. దేశ స్వాతంత్య్రంతో పాటు వివిధ అంశాలపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నారు. జాతీయ పతాకాలతో ర్యాలీలు, ఫ్రీడమ్ రన్, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, యువతకు క్రీడాపోటీలు, బాణాసంచా కాల్చడం ఇలా రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
వేడుకలకు మెదక్ కలెక్టరేట్ ముస్తాబు
స్వాతంత్య్ర వేడుకలకు మెదక్ జిల్లా ముస్తాబైంది. వజ్రోత్సవాల సందర్భంగా కలెక్టరేట్ను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్లో నేడు జాతీయ జెండా ఎగురవేసేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రాంగణంలో తాగునీరు, మెడికల్ క్యాంపు, స్టేజీ నిర్మా ణం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పొందుపర్చాల్సిన అంశాలపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.
జెండాను ఆవిష్కరించనున్న మంత్రి
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఉదయం 10.30 గంటలకు జెండావిష్కరించనున్నారు. 10.40 నుంచి 10.50 వరకు వంద న స్వీకరిస్తారు. 10.50 నుంచి 11.15 గంటల వరకు మంత్రి సందేశాన్ని ఇస్తారు. 11.15 నుంచి 11.30 గంటల వరకు స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం. విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు. 11.50 నుంచి మధ్యాహ్నం 12.20 వరకు మెమొంటోలు, ప్రశంసా పత్రాల ప్రదానోత్సవం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
రేపు సామూహిక గీతాలాపన
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించాలని మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్ పిలుపునిచ్చారు. ఆ సమయంలో పాఠశాలల్లో బెల్స్, ఇతర కూడళ్లు, ప్రదేశాల్లో సైరన్ మోగేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జాతీయ గీతాలాపన రాగానే ఎక్కడి వారు అక్కడే నిలబడి సెల్యూట్ చేస్తూ ఏకకాలంలో గీతాన్ని ఆలపించాలన్నారు. కలెక్టరేట్లో సాయంత్రం కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు.