పాపన్నపేట, ఆగస్టు14: పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. కొంతకాలంగా భారీగా వర్షాలు పడి వరదలు రావడంతో అమ్మవారి ఆలయం ఎదుట నుంచి నీరు ప్రవహించింది. దీంతో వనదుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేశారు. శనివారం సాయంత్రం వరద తగ్గడంతో అమ్మవారి ఆలయాన్ని పునఃప్రారంభించారు. దీంతో చాలాకాలం తర్వాత ఆదివారం ఆలయంలో పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, ఆలయ ఈవో సార శ్రీనివాస్, పాలకమండలి సభ్యులు ఆలయ సిబ్బంది కనీస సౌకర్యాలు ఏర్పాట్లుచేశారు. ఏడుపాయలలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పాపన్నపేట ఎస్సై విజయ్కుమార్ గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.