స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఫ్రీడం ర్యాలీలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాడలన్నీ త్రివర్ణ శోభితంగా మారాయి. పోతరాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలు, బతుకమ్మలు, పీర్ల ఊరేగింపులు, జాతినేతల వేషధారణలతో చిన్నారులు ర్యాలీల్లో సందడి చేశారు. సంగారెడ్డిలో 750 మీటర్ల పొడవైన జాతీయజెండాను ప్రదర్శించారు. మంత్రి తన్నీరు హరీశ్రావు పాల్గొన్నారు. పటాన్చెరులో 250 అడుగులు, చిట్కుల్లో 750 మీటర్ల , నారాయణఖేడ్ 120 అడుగులు జెండాను ప్రదర్శించారు. మెదక్లో భారీ ర్యాలీ తీశారు. అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. భారత్మాతాకీ జై నినాదాలు మిన్నంటాయి.
సంగారెడ్డి, (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 13 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సంగారెడ్డిలో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీ త్రివర్ణ శోభితంగా మారింది. కళాకారుల నృత్యాలు, బతుకమ్మలు, పీర్ల ఊరేగింపులతో ర్యాలీ ఆకట్టుకున్నది. 750 మీటర్ల పొడవైన జాతీయ జెండాను విద్యార్థులు ప్రదర్శించారు. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు గల ఈ పొడవైన జాతీయజెండా ర్యాలీని మంత్రి హరీశ్రావు శనివారం కలెక్టర్ డాక్టర్ శరత్, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అక్కడి నుంచి రిలయన్స్ వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు ర్యాలీ కొనసాగింది. చిన్నారుల విభిన్న వేషధారణలతో ఆకట్టుకున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, మహిళలు బతుకమ్మలతో ఊరేగింపులో పాల్గొన్నారు. కళాకారుల విన్యాసాలు అలరించాయి. ఎన్సీసీ క్యాడెట్ల కవాతు మిలటరీని తలపించింది. ర్యాలీకి వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి 1500 మంది విద్యార్థులు హాజరు కావడం విశేషం. ఫ్రీడమ్ ర్యాలీలో జాతీయజెండాలు రెపరెపలాడాయి.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీకి మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 75 వసంతాల స్వతంత్ర వేడుకలను కనీవినీ ఎరుగని రీతిలో సంగారెడ్డిలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నాడు తిండిలేక ప్రజలు అలమటించారని, నేడు ఆహార ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్నిరంగాల్లో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉందని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని చెప్పారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, అందుకే వేలకోట్ల రూపాయలతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులను బహుమతిగా ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు.
ఆగస్టు 15 నుంచి కొత్త ఆసరా పింఛన్లు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 15 నుంచి రాష్ట్రంలో కొత్త ఆసరా పింఛన్లను అందించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 లక్షల కొత్త పింఛన్లను అందించనున్నట్లు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో 42 వేల ఆసరా పింఛన్లు కొత్తగా అందించనున్నట్లు తెలిపారు. డయాలిసిస్ రోగులకు సైతం ఆసరా పింఛన్లు అందించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు.
ప్రగతి పథంలో మన పల్లెలు..
గాంధీజీ కలలు కన్న పల్లెలు మన రాష్ట్రంలో ఏర్పాటయ్యాయని మంత్రి అన్నారు. దేశంలో మొత్తం 20 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేస్తే తెలంగాణలోనే 19 గ్రామాలు ఉండడం ఇందుకు నిదర్శనం అన్నారు. ఇది మనం చెప్పింది కాదని, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సంసద్ ఆదర్శ యోజన పథకం వెల్లడించిన వివరాలుగా మంత్రి స్పష్టం చేశారు. 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. సీఎం పేదల పక్షపాతి అని.. ఎస్సీ, ఎస్టీలతో అన్నివర్గాల అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. కుల మతాలకు అతీతంగా 75 వసంతాల స్వతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు జాతీయ గీతాలాపన చేయాలని సూచించారు. ఎక్కడి వారు అక్కడే జాతీయ గీతం ఆలపించాలని, జాతి సమైక్యతను చాటాలని మంత్రి కోరారు. అంతకుముందు కలెక్టర్ శరత్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.