మెదక్/ సంగారెడ్డి నెట్వర్క్, ఆగస్టు, 13 : త్రివర్ణ పతాకం వీధివీధినా ఎగురడంతో ‘మెతుకుసీమ’ మెరిసింది. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. గ్రామాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో నిర్వహించిన జెండాల ప్రదర్శన అట్టహాసంగా జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతబూని వీధుల్లో నిర్వహించిన ర్యాలీల్లో ఉత్సాహంగా “భారత్ మాతాకీ జై.. అమరవీరులకు జోహార్లు” అంటూ నినదించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన 750 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శనలో ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీపాటిల్తో కలిసి ర్యాలీని ప్రారంభించారు. ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాలైన మెదక్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి, అందోల్లో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, నారాయణఖేడ్లో ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.