రక్షాబంధన్ వేడుకలు శుక్రవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా అనాథ ఆశ్రమాలతో పాటు పలుచోట్ల బాలబాలికలు, యువతులు, మహిళలు అధికారులు, ప్రజాప్రతినిధులకు రాఖీలు కట్టారు. కొత్త బట్టలు అందజేశారు. గురుకులాలు, బాలసదనాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించి చిన్నారులకు బట్టలు అందించి, స్వీట్లు తినిపించారు. పలు చోట్ల సీఎం కేసీఆర్ కటౌట్లకు మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులు, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించారు. జాతీయజెండాల పంపిణీ, తిరంగా ర్యాలీలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. జాతినేతల విగ్రహాలకు రాఖీలు కట్టి, పూలదండలు వేశారు.
అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రాఖీ. ఇంటింటా ఆనందాలు నింపే రక్షాబంధన్ను శుక్రవారం మెదక్ జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. దుకాణాల్లో రాఖీ కొనుగోళ్లతో సందడి కనిపించింది. నోరు తీపి చేసేందుకు స్వీట్ల అమ్మకాలూ జోరుగా సాగాయి. ఆడబిడ్డ లు ఇంటికి రావడంతో సంతోషం వెల్లివిరిసింది. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిలావ్యాప్తంగా ఆత్మీయ రక్షాబంధన్ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధు లు, అధికారులకు మహిళతోపాటు విద్యార్థినులు రాఖీ కట్టి, ఆశ్వీరాదం తీసుకున్నారు.
రాఖీ పండుగను మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఘనంగా జరుపుకొన్నారు. సోదరీమణులు సోదరులకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు. ఆడబిడ్డలు రక్షాబంధన్ను పురస్కరించుకొని పుట్టినిళ్లకు రావడంతో సంతోషాలు విరబూశాయి. ఆయా జిల్లాల్లోని ప్రజాప్రతినిధులకు పలువురు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సంగారెడ్డి జిల్లాలోని జడ్పీటీసీలు ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిని కలిసి రాఖీ కట్టారు. – మెదక్/ సంగారెడ్డి నెట్వర్క్, ఆగస్టు 12