సంగారెడ్డి/ మెదక్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నామని, ఆగస్టు 15 నుంచే వాటిని మంజూరు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆశలు రేకెత్తాయి. డయాలసిస్ రోగులకు పింఛన్ ఇస్తామని సీఎం ప్రకటించడంతో బాధితులకు భరోసా ఏర్పడింది. మెదక్ జిల్లాలో ఇప్పటికే లక్ష మంది ఆసరా పింఛన్ పొందుతుండగా, కొత్తగా 9వేల మందికి లబ్ధి చేకూరనున్నది. దీంతో జిల్లాలో పింఛన్దారుల సంఖ్య 1.10 లక్షలకు చేరనున్నది. డయాలసిస్ రోగులకు రూ.2016 పింఛన్ అందనున్నది. మెదక్ జిల్లాలో ప్రస్తుతం 1,00,248 మందికి ప్రభుత్వం పింఛన్లు ఇస్తుండగా, ప్రతినెలా రూ.21 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 1,34,475 మంది ఆసరా ఫించన్లు అందుకుంటుండగా, ప్రతి నెలా ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో రూ.28.60 కోట్లు పింఛన్ డబ్బులను ప్రభుత్వం జమ చేస్తున్నది.
డయాలసిస్ రోగులకు ఆసరా పథకం కింద పింఛన్ ఇవ్వనున్నట్టు ప్రకటించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేస్తున్న మనసున్న ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారు. గత ప్రభుత్వాల హయాంలో రెండు వందల పింఛన్ మాత్రమే ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దివ్యాంగులకు రూ.3,016, వృద్ధాప్య, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2016 పింఛన్ ఇస్తున్నారు. ఆసరా పింఛన్తో సామాజిక భద్రత ఏర్పడింది.
– పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్యే మెదక్
వితంతువులు 64,921
దివ్యాంగులు 14,793
ఒంటరి మహిళలు 7,279
చేనేత కార్మికులు 737
గీత కార్మికులు 782
బీడీ కార్మికులు 94
బోదకాలు వ్యాధిగ్రస్తులు 389
అర్టిజన్లు 1747
మొత్తం 1,34,475
సంగారెడ్డి జిల్లాలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు 41,984 మంది ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అదనంగా మరో 41,984 మందికి లబ్ధి చేకూరనున్నది. ఇందులో 65 ఏండ్లు దాటిన వారు 14,420 మంది కాగా, 57 నుంచి 64 ఏండ్ల వారు 27, 564 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే పింఛన్ పంపిణీ చేస్తాం. మెదక్ జిల్లాలో 9,281 మందికి కొత్తగా ప్రయోజనం కలగనున్నది. కొత్త పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం. వీరందరి జాబితా సిద్ధంగా ఉంది.
– శ్రీనివాస్, డీఆర్డీవో మెదక్