సిద్దిపేట, ఆగస్టు 10 : అది దేశమంతా స్వాతంత్య్రం కోసం పోరు జరుగుతున్న సమయం.. కానీ హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలన నడుస్తున్నది. ఇక్కడ మువ్వెన్నెల జెండాలు నిషేధం..అయితేనేమి నాడు గాంధీజీ మహాత్ముడు పోరాట స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా అనేక మంది యువకులు స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా సిద్దిపేట పట్టణంలో భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాటం జరిగింది. ముందు నుంచి చైతన్యానానికి ప్రతీకగా నిలిచే సిద్దిపేటలో కొంత మంది యువకులు నాటి పాలకుల ఆజ్ఞను సైతం ధిక్కరించి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. అలాంటి వారిలో శానంగారి బ్రహ్మయ్యచారి ఒకరు. భారతదేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ వారిని యాది చేసు కుంటూ భవిష్యత్ తరాలకు వారి త్యాగాలను తెలిపేందుకు ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న కథనం..
దేశమంతా స్వేచ్ఛకావాలని తమకు స్వాతం త్య్రం కావాలని గాంధీ మహాత్ముడి నాయకత్వంలో పోరు చేస్తున్న సమయంలో మన తెలంగాణ ప్రాంతంలోనూ ప్రజలు స్వేచ్ఛా వాయువులు కావాలని బలంగా కోరుకున్నారు. అనేక చైతన్యమైన ఉద్యమాలకు ప్రతీకైన సిద్దిపేటలోనూ కొంత మంది యువకులు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. అలాంటి వారిలో శానంగారి బ్రహ్మయ్యచారి ఉన్నారు. సిద్దిపేట పట్టణంలోని పారుపల్లి వీధికి చెందిన బ్రహ్మయ్యచారి 36వ ఏటా 1942లో జరిగిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో సభ్యుడైన బ్రహ్మయ్య చారి స్వతంత్రం కోసం జరుగుతున్న అనేక ఉద్యమాల్లో పాల్గొని జైలుకు వెళ్లారు.
అప్పట్లో కొంత మంది దేశభక్తి భావాలు కలిగిన యువకులతో కలిసి ఒక గ్రూప్ను తయారు చేసి చిన్న కోడూరు మండలం విఠలాపూర్లో జాతీయ జెండాను ఎగురవేసి భారత్మాతాకి జై, వందేమాతరం అంటూ నివాదాలు చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. పలుమార్లు పోలిసులు ఆరెస్టు చేసి సిద్దిపేట, సంగారెడ్డి జైల్లో రెండు నెలల పాటు ఉంచారని తెలిపారు. సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1962లో కొండపాక మండలం వెలికట్ట గ్రామ శివారులో 10 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో కేటాయించింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధ్దించిన తర్వాత బ్రహ్మయ్యచారి సేవలను గుర్తించిన ప్రభుత్వం అయన సతీమణి రత్నమ్మను జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఘనంగా సత్కరించింది.