సిద్దిపేట, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఉత్సవాలు ఆకట్టుకుంటున్నాయి. ఇంటింటా జాతీయ జెండా ల పంపిణీ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు మంగళవారం ఇంటింటా జాతీయ జెండాలు పంపిణీ చేశారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ శ్వేత ఉన్నారు. స్వయంగా మంత్రి ఇంటింటికీ తిరిగి జాతీయజెండా విశిష్టత, ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. అంతకు ముందు పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జాతిపిత సేవలను స్మరించుకున్నారు. సిద్దిపేట జిల్లాలో రెండు, మూడు రోజుల్లో జాతీయజెండాలను పంపిణీ పూర్తి చేయనున్నా రు. జిల్లాలో 3 లక్షలకు పైగా జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పంపణీ చేశారు.
ఈ నెల 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసేలా కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఇతర భవనాలపై జాతీయ జెండా ఎగుర వేయనున్నారు. ఆర్టీసీ సంస్థ బస్సులకు జాతీయ జెండాలు ఏర్పాటు చేసింది. ప్రజలు వాట్సాప్, ప్రొఫైల్ పిక్లుగా జాతీయ జెండాలను పెట్టుకుంటున్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ స్ఫూ ర్తిని నలుదిశలా చాటేందుకు ఈ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్నది. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభు త్వం పిలుపునిచ్చింది. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువతీయువకులు ఇలా అన్ని వర్గాల వారు ఈ వజ్రోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసేలా రోజు వారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు. ఇందులో భాగంగా మంగళవారం ఇంటింటా జాతీయజెండాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర ప్రతిష్టాత్మక భవనాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, జనసమ్మర్ధ ప్రాంతాల్లోని కూడళ్లను 15 రోజుల పాటు విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. అన్ని విద్యాసంస్థల్లో ప్రతిరోజు ప్రార్థన సమయంలో దేశభక్తి గీతాలను ఆలపిస్తున్నారు.
బుధవారం (నేడు) అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇలా వినూత్న కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఎలా పోరాటాలు జరిగాయో వివరించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అన్ని సినిమా థియేటర్లలో గాంధీ సినిమా ప్రదర్శించనున్నారు. గాంధీ చిత్రాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు చూపిస్తారు. నాటి ఉద్యమ ఘట్టాలు, పోరాటయోధుల గురించి ప్రజలకు తెలిసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. స్వాతంత్య్ర భారత్ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ 12 రోజల పాటు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నది. ఆగస్టు 15న పుట్టిన చిన్నారులందరికీ 12 సంవత్సరాల వరకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. 75 ఏండ్లు పూర్తి చేసుకున్న వారు ఆగస్టు 15న బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.