తొగుట/కొమురవెల్లి, ఆగస్టు 8: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని చాలా మంది అమాయక ప్రజలు మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్లు నెట్టింట వేదికగా దోపిడీకి పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనం. ఇఅవల కాలంలో సైబర్ నేరాలు చాలా పెరిగాయి. ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులను పట్టుకొని, డబ్బులు రికవరీ చేయడం పోలీసులకు సైతం కష్టతరంగా మారింది. ఉద్యోగుల నుంచి మొదలుకొని, సామాన్యులే కాదు.. చివరకు ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు సైతం సైబర్ మోసాలకు గురైన వారిలో ఉండడం గమనార్హం.
లింక్లు క్లిక్ చేస్తే అంతే సంగతులు
సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో ప్రతిదీ డిజిటలైజేషన్గా మారింది. ఎక్కువ మంది ఆన్లైన్ షాపింగ్పై ఆధారపడుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉన్నప్పటికీ డిస్కౌంట్లు, ఇతర ఆఫర్ కోసం క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా డబ్బులు కట్టెస్తున్నారు. దీన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మాలుచుకుంటున్నారు. అచ్చం అలాగే అనిపించేలా కంపెనీలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల లోగోలతో నకిలీ వెబ్సైట్లను సృష్టించి ఆన్లైన్లో ఉంచుతున్నారు. దీంతో ఎవరైనా ఆ లింక్ క్లిక్ చేసి తమ వ్యక్తిగత వివరాలు నమోదు చేయడంతో మన ఖాతాలో ఉన్న నగదును మనకు తెలియకుండానే దోచేస్తున్నారు. సెల్ఫోన్ నెంబర్కు ఆధార్తో పాటు బ్యాంకు ఖాతాలు, భూముల వివరాలు, ఉద్యోగ సమాచారం వంటివి అనుసంధానమై ఉంటాయి. దీంతో నేరగాళ్లు ఏదో రకంగా ఫోన్ నెంబర్ను సేకరించి, దానికి ఉన్న యూపీఐ ఐడీని తెలుసుకోవడానికి అనేక రకాల లింక్లను సృష్టిస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే ఇకపై వాడలేరు.. అంటూ మెసేజ్లు పంపుతారు. ఏదో అయిపోతుందనే కంగారులో సదరు లింకులను క్లిక్ చేసిన వెంటనే ఖాతా వివరాలు పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తున్నాయి. నేరగాళ్లు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ప్రోగ్రామింగ్ యాప్ నుంచి బ్యాంకు ఖాతా నిలిచిపోయి వారి బ్యాంకు ఖాతా నుంచి సునాయాసంగా నగదు కాజేస్తున్నారు.
బ్యాంక్ నుంచి అని..
తొగుట మండలానికి చెందిన ఒక రైతు నర్సింహులు(పేరు మార్చాం) కాల్ వచ్చింది. బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా.. నీ ఏటీఎం టైం అయిపోయింది. మార్చుకోవాలి.. ఆధార్ నెంబరు, ఏటీఎం నెంబర్లు చెప్పాలని కోరాడు. బ్యాంక్ నుంచి కాల్ అనుకొని, వివరాలు చెప్పాడు. ఇంతలోనే ఖాతా నుంచి రూ.35వేలు పోయినట్టు మెస్సేజ్ రావడంతో బిత్తరపోయారు. బ్యాంక్కు వెళ్లినా, అప్పటికే డబ్బులు డ్రా కావడంతో తాము ఏమి చేయలేమని చెప్పేశారు. చేసేదేమి లేక రైతు పంట డబ్బులు పోయయని కుటుంబం మొత్తం తీవ్రంగా విలపించింది.
డ్వాక్రా గ్రూప్ నుంచి అని..రూ.15 వేలు టోకరా
సైబర్ నేరస్తుడు: హలో శశిరేఖనా?(పేరు మార్చాం)..
బాధితురాలు: అవును సార్.. మీరు ఎవరు?
సైబర్ నేరస్తుడు: మేము మహిళా గ్రూప్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాం..మీరు మహిళా గ్రూప్లో మెంబర్ కదా!
బాధితురాలు: అవును సార్.. ఎందుకు సార్?
సైబర్ నేరస్తుడు: సంతోషం.. మీకు కరోనా మూలంగా సహాయం చేయడానికి ప్రభుత్వం డబ్బులు మంజూరు చేసింది. మీకు రూ. 15వేలు మంజూరయ్యాయి.
బాధితురాలు: అవునా సార్.. నాకే ఇస్తున్నారా? అందరికి ఇస్తున్నారా?
సైబర్ నేరస్తుడు: విడతల వారీగా అందరికి ఇస్తున్నాం.. కరోనా ఉంది కదా.. బ్యాంక్లకు వెళ్లకుండా మీకు నేరుగా మీ గూగుల్ పే, ఫోన్లకు పంపిస్తున్నాం. మీకు ఈ యాప్స్ ఉన్నాయా..ఉంటే ఓపెన్ చేయండి.
బాధితురాలు: నా ఫోన్లో లేవు సార్..
సైబర్ నేరస్తుడు: పర్వాలేదు.. మీకు తెలిసిన వారివి ఉన్నా సరే, అందులో డబ్బులు మాత్రం ఉండాలి.
బాధితురాలు: లేవు సార్.. ఇప్పుడెట్లా సార్.. నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. డబ్బులు పంపియ్యండి సార్.
సైబర్ నేరస్తుడు: పర్వాలేదు. మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని, కాల్ చేయండి..
కొద్ది నిమిషాల తర్వాత..
సైబర్ నేరస్తుడు: డౌన్లోడ్ చేసుకున్నారా?
బాధితురాలు: ఫోన్ పే డౌన్లోడ్ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయమంటారు.
సైబర్ నేరస్తుడు: ఫోన్ పే యాప్లోకి వెళ్లి, అందులో ఉన్న ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లోకి వెళ్లండి. మీ ఖాతాలో ఉన్న డబ్బులు సెండ్ చేయండి..
బాధితురాలు: డబ్బులు మీరు వేస్తా అన్నారు కదా సార్.. మేము వేయడం ఏంటి? అర్థం కావడం లేదు?
సైబర్ నేరస్తుడు: అలా కాదమ్మా.. అందులో వేస్తే మీ ఖాతాలోనే ఉంటాయి. మీరు వేయగానే మేము జమ చేస్తాం.. సరేనా.
బాధితురాలు: సరే సార్.. రూ.10 వేలు, రూ.5 వేలు కలిపి సెండ్ చేశా సార్..
సైబర్ నేరస్తుడు: సరేనమ్మా.. మీ ఖాతాలోకి డబ్బులు పంపుతున్నా..
బాధితురాలు: సార్.. నా అక్కౌంట్లో నుంచి డబ్బులు రూ.15 వేలు పోయాయి అని మెసేజ్ వచ్చింది. ఏంటిది సార్.. డబ్బులు వేస్తా అంటే ఉన్నయి పోయాయి..
సైబర్ నేరస్తుడు: ఏం బాధ పడకండి. డబ్బులు రూ.15 వేలతో పాటు మరో రూ.15 వేలు కలిపి రూ.30 వేలు జమ అవుతాయి.
కొద్ది నిమిషాల తర్వాత..
బాధితురాలు అదే నెంబర్కు కాల్ చేయగా, స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించి బోరున విలపిచింది. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
మిషన్ కుట్టుకుంటూ స్వయం ఉపాధితో కుటుంబాన్ని పోషించుకుంటున్న తొగుట మండలంలోని ఒక గ్రామానికి చెందిన నిరుపేద మహిళ 5 రోజుల క్రితం సైబర్ నేరస్తుని చేతిలో ఉన్న డబ్బులు పోగొట్టుకుంది. ఫోన్ మాట్లాడే వ్యక్తి సామర్థ్యాన్ని ముందే అంచనా వేసే సైబర్ నేరస్తుడు, వారి వీక్నెస్ను అనుకూలంగా మలుచుకుంటాడు. డ్వాక్రా గ్రూప్లో సభ్యురాలివా అంటే..99శాతం మంది స్వయం సహాయక సంఘాల గ్రూపుల్లో ఉంటారు. కరోనా సమయంలో ప్రభుత్వం సాయం చేస్తున్నదంటే నమ్ముతారని అలా మోసం చేశాడు.
ఫేస్బుక్ ద్వారా..
కొండపాక మండలానికి చెందిన ఒక వ్యాపారికి ఫేస్బుక్లో అకౌంట్ ఉంది. అతనికి ఒక అందమైన యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. యువతి బాగుందనుకొని, అతడు ఆమె రిక్వెస్ట్ను అనుమతించాడు. ఇంకేంది.. మెస్సేంజర్ ద్వారా హాయ్.. బాయ్.. అంటూ.. ఇంగ్లిష్, హిందీ భాషల్లో చాటింగ్ చేసింది. నీకు ఆన్లైన్ సెక్స్ చూపిస్తా.. నీ వాట్సాప్ నెంబర్ సెండ్ చేయాలని కోరగానే, అతడు సెండ్ చేశాడు. వీడియో కాల్లో నగ్నంగా మాట్లాడుకున్నారు. తర్వాత ఆ వీడియోను అతనికి పంపింది. నాకు డబ్బులు పంపితే దీన్ని తొలగిస్తా.. లేకుంటే ఫేస్ బుక్, సోషల్ మీడియాలో పెడుతా.. అని హెచ్చరించింది. ఆమె వార్నింగ్కు అతనికి చెమటలు పట్టాయి. సమాజంలో ఎంతో పరువుగా బతుకుతున్న ఆయన.. డబ్బులిచ్చి, ఆ గండం నుంచి బయట పడ్డాడు.. మళ్లీ ఫేస్బుక్లో అమ్మాయిల రిక్వెస్ట్ వస్తే వణుకుతున్నాడు.. విచిత్రం ఏమంటే పూజా శర్మతో ఉన్న ఆ ఫేక్ అకౌంట్కు సిద్దిపేట జిల్లాకు చెందిన వందల మంది ఫ్రెండ్స్గా ఉండటం గమనార్హం. ఇంకేంది ఒక్కొక్కరిని టార్గేట్ చేస్తూ పని కానిస్తాడన్నమాట.. అసలు విషయం ఏమంటే యువతి పేరు మీద ఒక సైబర్ క్రైమ్ నేరస్తుడు ఈ నేరాలకు పాల్పడుతున్నాడన్నమాట.
ఇలాంటి కేసులే ఎక్కువ..
గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికారంటే సైబర్ నేరగాళ్ల చేతిలో పడినట్లే. ఆధార్ ఎనబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఏటీఎం సౌకర్యం లేని ప్రాంతాల్లో నగదును తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఏఈపీఎస్ పద్ధతిని ప్రవేశపెట్టింది. తద్వారా ఫింగర్ ప్రింట్ సాయంతో రోజుకు రూ.10వేల వరకు డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇది కూడా సైబర్ నేరగాళ్లకు ఒక అవకాశంగా మారింది. దీంతో పలు రకాలుగా ప్రజల వేలిముద్రలను సేకరించి, ఏఈపీఎస్ ద్వారా డబ్బులు దోచేస్తున్నారు.
ఆర్మీ ఆఫీసర్నంటూ బురిడీ
తానొక ఆర్మీ ఆఫీసర్నని, బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్తున్నానని, ఇంట్లో వస్తువులు, బైక్, కారును అక్కడి వరకు తీసుకువెళ్లలేనని, తక్కువ ధరకే విక్రయిస్తాననే పోస్టులు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా ఎక్కువయ్యాయి. ముందుగా ఫోన్ పే, గూగుల్ పేలలో అడ్వాన్స్గా తీసుకొని, ఆపై మాటలతో రూ.5వేల నుంచి రూ.10వేల వరకు దోచుకుంటున్నట్లు బాధితులు చెబుతున్నారు. వాట్సాప్ ప్రొఫైల్లో జాతీయ జెండా, మిలటరీ డ్రెస్లో ఫోటోలు చూసి నిజంగా ఆర్మీలో పని చేసే వ్యక్తేనని నమ్మి మోసపోతున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం..
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరుగుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో కళాజాత ప్రదర్శనలు నిర్వహించి, మూఢనమ్మకాలతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఊరికే మనకు ఎవరూ డబ్బులు ఇవ్వరు అన్న సంగతి మరువొద్దు.. నిరక్షరాస్యుల కన్నా అక్షరాస్యులే ఎక్కువగా మోసం పోతున్నారు. ఎలాంటి మోసం జరిగినా తొందరగా స్పందించి, దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. బ్యాంక్ మేనేజర్ అంటూ, ప్రభుత్వ అధికారినంటూ వచ్చిన కాల్స్ను నమ్మొద్దు. ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి, డబ్బులు కావాలని అడుగుతున్నారు. అలాంటి వారికి డబ్బులు పంపిచొద్దు. వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి.
– శ్వేత, సిద్దిపేట సీపీ
వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బు రికవరీ
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే, 24 గంటల్లోపు జాతీయ హెల్ప్లైన్ 155260తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వెబ్ పోర్టల్కు ఫిర్యాదు చేయాలి. అలా చేయడంతో పోగొట్టుకున్న సొమ్మును సైబర్ క్రైం ఖాతాల్లోకి బదిలీ కాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సైబర్ నేరగాళ్ల ఖాతాలో డబ్బు ఉన్నప్పుడు బ్యాంకు అధికారులను అప్రమత్తం చేసి, వాటిని ఫ్రీజ్ చేస్తారు. ఇది 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే సాధ్యమవుతుందని పోలీసులు పేర్కొంటున్నారు.
ఫిర్యాదు చేసే సమయంలో మీ దగ్గర ఉండాల్సిన వివరాలు..
ఫిర్యాదుదారుడి ఫోన్నెంబర్
ఖాతా ఉన్న బ్యాంకు పేరు, వాలెట్ పేరు.
బ్యాంకు అకౌంట్ నెంబర్, వాలెట్, మర్చంట్ ఐడీ, యూపీ ఐడీ నెంబర్లు.
లావాదేవి జరిపిన ఐడీ, తేదీ, సమయం.
డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిగితే వాటి నెంబర్లు.
మోసానికి సంబంధించిన లావాదేవీల స్క్రీన్షాట్లు తీసిపెట్టుకోవాలి.
ఫిర్యాదు ఎక్కడ చేయాలి..
సైబర్ క్రైం జాతీయ హెల్ప్లైన్ నెంబర్-1930 (155260)
www.cybercrime.gov.in
హైదరాబాద్ సైబర్ క్రైం పీఎస్- 040-27854212
సైబరాబాద్ సైబర్ సెల్
040-27854031, 27853418, 9490617310, 9490617100.
* ఈ మెయిల్: cybercrimesrck@cyb.tspolice.gov.in
* రాచకొండ సైబర్ సెల్ 040-27854044, 040-79609043,acp-cybercrimerck @cyb.tsplice.gov.in