మునిపల్లి, ఆగస్టు 8 : ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని బుధేరా మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు మాస్క్ తప్పకుండా ధరించాలని సూచించారు. కరోనా బారిన పడ్డ విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దన్నారు. వైద్యల సూచనల మేరకు మందులు వాడాలన్నారు. రెండు రోజు క్రితం బుధేరా మహిళా డిగ్రీ కళాశాలలో వైద్యులు పరీక్షలు నిర్వహించగా, 10 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థులకు కరోనా రావడంతో కళాశాలను సందర్శించి, మనోధైర్యం కల్పించినట్లు తహసీల్దార్ తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు చెప్పారు. వసతి గృహం, డైనింగ్ హాల్లో భోజనం చేసిన తర్వాత వేస్టేజ్ను ఒకే దగ్గర వేయాలని ఎంపీడీవో రమేశ్ చంద్ర కులకర్ణి విద్యార్థులకు సూచించారు. డైనింగ్ హాల్లో విద్యార్థులు భోజ నం చేసిన తర్వాత వేస్టేజ్ను ఒకే దగ్గర వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ను కోరారు. పంచాయతీ కార్మికులు డంపింగ్ యార్డులో వేయనున్నట్లు చెప్పారు. వసతి గృహం చుట్టు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారి వెంట మునిపల్లి ప్రాథమిక కేంద్రం డాక్టర్ శిరీష, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాధవి ఉన్నారు.
తూప్రాన్లో ఆరుగురికి..
పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో సోమవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలో ఆరుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పట్టణానికి చెందిన ముగ్గురికి, మండలంలోని ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి గ్రామాలకు చెందిన ఒక్కొక్కరికి, రామాయంపేట మండలానికి చెందిన మరొకరికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయినట్లు సామాజిక దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అమర్సింగ్ తెలిపారు.