13వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మన సామర్థ్యలను తక్కువగా అంచనా వేయవద్దని, స్వీయ సంకల్పం, కృషి, ఆశయం, పట్టుదలతో అద్భుతాలు సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు విశేష కృషి చేసిన ప్రొఫెసర్ శాంతాసిన్హా, ప్రముఖ తెలుగు రచయిత అంపశయ్య నవీన్కు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. వివిధ విభాగాల విద్యార్థులకు పట్టాలు, అత్యుత్తమ ప్రతిభకనబర్చిన వారికి బంగారు పతకాలు అందజేశారు.
పటాన్చెరు, జూలై 30 : ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపోటములు సహజమని, జీవితంలో జరిగిన వైఫల్యాలతోనే జీవిత పాఠాలు నేర్చుకుంటామని, ఓటమి నుంచే గెలుపు దారులు కనిపిస్తాయని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి అన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన 13వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్నాతకోపన్యాసం చేశారు. తన 24 ఏండ్ల ప్రయాణంలో మంచి చెడులు, ఆశ నిరాశలు, ఎత్తు పల్లాలను ఎన్నో చూసినట్టు చెప్పారు. మన ప్రయత్నమే మరింత బలాన్ని ఇస్తుందనే జర్మన్ తత్వవేత్త ఫ్రెడరిక్ నీట్జ్ కొటేషన్ను ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు. పీహెచ్డీ అధ్యయనానికి మార్గదర్శనమే కీలక భూమిక పోషిస్తుందని చెప్పారు. మన సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయవద్దని, స్వీయ సంకల్పం, కృషి, ఆశయం, పట్టుదలతోనే అద్భుతాలు సాధ్యమని పేర్కొన్నారు. గీతం అధ్యక్షుడు శ్రీభరత్ మాట్లాడుతూ..కరోనా మహమ్మారి సమయంలో విద్యారంగం చాలా సవాళ్లను ఎదుర్కొన్నదన్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ గురించి పునరాలోచించడానికి ఇది మంచి అవకాశం కల్పిస్తున్నదన్నారు.
డాక్టరేట్ల ప్రదానం…
స్నాతకోత్సవంలో భాగంగా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు విశేష కృషి చేసినందుకు ప్రొఫెసర్ శాంతాసిన్హా, ప్రముఖ తెలుగు రచయిత అంపశయ్య నవీన్కు గౌరవ డాక్టరేట్ (డీ.లిట్)లను ఇచ్చి సత్కరించారు. 200 యూజీ, పీజీ, డాక్టరల్ కోర్సులు, 23,500మంది రెగ్యులర్ విద్యార్థులు, 2,180మంది పరిశోధకులకు, 1,500మంది అధ్యాపకులతో విద్యను అందిసున్నట్టు గీతం ప్రొవీసీ(అకడమిక్స్) ప్రొఫెసర్ జయశంకర్ ఇ వారియర్ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. డిజిటల్, మిశ్రమ అభ్యాసాన్ని అమలు చేయడం ద్వారా విద్యార్థి-కేంద్రీకృత అభ్యాసాన్ని గీతం వర్సిటీ తప్పనిసరి చేసినట్టు తెలిపారు. గీతం హైదరాబాద్ ప్రాంగణంలో 1,346మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్, ఫార్మసీ, హ్యూమానిటీస్ వంటి విభాగాల్లో డిగ్రీలు 1,133 మంది విద్యార్థులు, 35మంది పరిశోధకులు వ్యక్తిగతంగా హాజరై పట్టాలను స్వీకరించారు. అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన 18మంది విద్యార్థులు బంగారు పథకాలు అందుకున్నారు.
కన్నులపండువగా స్నాతకోత్సవం
గీతం స్నాతకోత్సవం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఆకాశమే హద్దుగా పట్టాలు పొందిన విద్యార్థులు చెలరేగిపోయారు. గీతం శివాజీ ఆడిటోరియంలో కుటుంబ సభ్యుల సమక్షంలో పట్టాల ప్రదానం జరిగింది. గీతం హైదరాబాద్ ప్రాంగణంలో 1,346 మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్, ఫార్మసీ, హ్యూమానిటీస్ వంటి విభాగాల్లో డిగ్రీలు 1,133 మంది విద్యార్థులు, 35మంది పరిశోధకులు వ్యక్తిగతంగా హాజరై పట్టాలు స్వీకరించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 18 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకున్నారు. ఈసీఈ విభాగంతో పాటు బీటెక్ టాపర్గా నిలిచిన నక్కా నవ్యశ్రీ గీతం అధ్యక్షుడి పేరిట నెలకొల్పిన రెండు బంగారు పతకాలు అందుకున్నారు. పీజీ విద్యార్థిని సీ.రేఖాయాదవ్, యూజీ విద్యార్థిని అముక్త చౌదరి గద్దె బెస్ట్ ఆల్ రౌండర్ బంగారు పతకాలు పొందారు. పట్టాలు పొందిన విద్యార్థులు సెల్ఫీలతో సందడి చేశారు. కార్యక్రమంలో గీతం కులపతి డాక్టర్ వీరేందర్సింగ్ చౌహాన్, ఉప కులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం, గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొసెసర్ డీఎస్ రావు, గీతం వైద్య కళాశాల ప్రోవీసీ డాక్టర్ గీతాంజలి బత్మనాబానే, గీతం బెంగళూర్ ప్రొవీసీ ప్రొఫెసర్ ఎంఎస్ మోహన్కుమార్, డీన్లు ప్రొఫెసర్ అమిత్ భద్రా, సయ్యద్ అక్బరుద్దీన్, గీతం రిజిస్ట్రార్ డాక్టర్ డీ గుణశేఖరన్, ప్రొఫెసర్ పీ రామారావు, ప్రొఫెసర్ సీ విజయ్శేఖర్, గీతం కార్యదర్శి ఎం భరద్వాజ, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ పాల్గొన్నారు.