గజ్వేల్, జనవరి 23 : సీఎం కేసీఆర్ను ఆదివారం ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డిలు కలిశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి అధికారులతో చర్చించి నివేదికలను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని ఆదేశించినట్లు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు స్థానిక నాయకులు కూడా కృషి చేయాలని సూచించారన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. అలాగే, నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఇప్పటికే నిర్వహించాల్సి ఉండగా కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏర్పాటు చేయలేదని, కరోనా తగ్గిన తర్వాత వీలైతే ఫిబ్రవరి నెలాఖరులోగా సమావేశాన్ని నిర్వహించుకుందామని సూచనప్రాయంగా తెలిపారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి తెలిపారు.