సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి అర్బన్, జూలై 18: అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు మంగళవారం సంగారెడ్డి, పటాన్చెరు పట్టణాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
సంగారెడ్డి పట్టణంలో రూ.2.90 కోట్లతో నిర్మించనున్న బీసీ బాలికల వసతి గృహం పనులకు శంకుస్థాపన, మున్సిపాలిటీ పరిధిలోని చింతలపల్లిలో రూ.13 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంత్రి ప్రారంభించనున్నారు. గంజ్మైదాన్లో రూ.1.38 కోట్లతో నిర్మించిన దుకాణా సముదాయాలు, పట్టణంలోని 16, 38 వార్డుల్లో రూ.15 కోట్లతో నిర్మించిన వాటర్ ట్యాంకులు, సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో పీడీయాట్రిక్ వార్డును ప్రారంభించి, అక్కడ మొక్కలు నాటనున్నారు.
అనంతరం పటాన్చెరు నియోజకవర్గంలో అమీన్పూర్ లింగమయ్యకాలనీ, బీరంగూడలోని బుడగజంగం కాలనీ, బందంకొమ్ము ఇందిరాకాలనీ, బొల్లారం ఎస్సీకాలనీ, తెల్లాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలను, పటాన్చెరు ప్రభుత్వ దవాఖానలో సీటీ స్కాన్ సేవలను మంత్రి ప్రారంభించనున్నారు. మంత్రి హరీశ్రావు పర్యటన సందర్భంగా సోమవారం మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డిలో ఏర్పాట్లను పరిశీలించారు.
ఆయా ఏర్పాట్లపై మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. దవాఖాన ఆవరణలో మొక్కలు నాటే ప్రాంతాన్ని పరిశీలించి కావాల్సిన వివిధ రకాల మొక్కలు సిద్ధంగా ఉంచాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని 38వార్డులను అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. నూతన పనులతో పాటు పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.
రూ.50 కోట్లతో అభివృద్ధి పనులకు
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మున్సిపాలిటీలో ప్రగతి పనులకు ఆయా నిధులు మంజూరు చేశారు. దీంతో మున్సిపాలిటీలో చేపట్టవలసిన పనులపై మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు పట్టణంలోని 38 వార్డుల్లో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీరవి, వైస్చైర్పర్సన్ లతావిజయేందర్రెడ్డి, కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటించి పనులను గుర్తించారు. చేపట్టాల్సిన ఆయా పనులపై ప్రణాళికలు రూపొందించారు. ఆయా పనులపై రూపొందించిన ప్రత్యేక పైలాన్ను మంత్రి హరీశ్రావు నేడు ఆవిష్కరించనున్నారు.