చేర్యాల, జూలై 17 : నియోజకవర్గంలో మేజర్ గ్రామ పంచాయతీ ఆకునూరులో రోజురోజుకూ దొంగతనాలు పెరిగిపోతున్నాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురువుతున్నారు. కొన్ని నెలలుగా గ్రామంలో తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. ప్రజలు వ్యవసాయ పనులు, శుభకార్యాలకు వెళ్లాలంటే ఆందోళనకు గురవుతున్నారు. గ్రామంలో ఏర్పా టు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తుల ఆచూకీ లభించక పోలీసులు తలలు పట్టుకుంటున్నాయి. గ్రామంలో మాజీ సర్పంచ్ కౌసల్యమాధవరెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. పంచాయతీ పాలకులు బిల్లుల విషయంలో చూపించే శ్రద్ధ ప్రజల ఆస్తుల రక్షణలో చూపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విషయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన సంఘాలు చొరవ చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాళం వేసి ఉంటే ఇక లూఠీ
గ్రామంలో తాళం వేసి ఉంటే ఇండ్లు గుల్లయ్యే పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఆరే శ్రీరాం రైతు ఇం టికి తాళం వేసి తన బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లి వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు 2 తులాల బంగారం, 60 వేల నగదు ఎత్తుకెళ్లారు. అదే గ్రామానికి చెం దిన అల్లెపు జనార్దన్ ఇంటికి తాళం వేసి జాతరకు వెళ్లి తిరిగి వచ్చే సరికి తాళం పగులగొట్టి తులం బంగారం, రూ.2లక్షల నగదును ఎత్తుకుపోయారు. కంతుల చంద్రయ్య బంధువుల ఇంటికి వెళ్లగా దుండగులు బియ్యం సంచిలో ఉన్న రూ.5వేల నగదు, బీరువాలో ఉన్న జాకెట్లను కత్తెరతో కత్తిరించి గ్రామం బయట పడేశారు. ఈ నెల 15న అనుముల సుగుణ తమ వ్యవసాయ బావి వద్దకు పనులు నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లింది. సాయం త్రం వచ్చేసరికి ఇంటికి వెనుక నుంచి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి 2 తులాలు బంగారం, 15 తులా ల వెండి వస్తువులను ఎత్తుకుపోయారు. గ్రామంలో వ్యవసాయ బావుల వద్ద ట్రాక్టర్ కేజ్వీల్స్కు సంబంధించిన వస్తువులు, మోటర్ స్టాటర్లను సైతం ఎత్తుకెళ్లుతున్నారు.
సేఫ్ జోన్లో విలువైన వస్తువులు
గ్రామంలో జరుగుతున్న దొంగతనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు విలువైన వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం లేదు. తప్ప ని పరిస్థితిలో ఇతర గ్రామాలకు వెళ్లాల్సిన వస్తే తమ విలువైన వస్తువులను బంధువులు, స్నేహితులకు అప్పగించి వెళ్తున్నారు. పోలీసులు నిత్యం గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్నా దొంగల ఆచూకీ లభించడం లేదు. గ్రామంలో ఉన్న వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్నారా.. లేదా పరిసర గ్రామాల నుంచి వచ్చి చోరీలు చేస్తున్నారా అని అనుమాలు వ్యక్తమవుతున్నాయి.