వరంగల్/ఖిలా వరంగల్/హనుమకొండ చౌరస్తా, జూలై 7 : ఏడువందల ఏండ్లకు ముందు తెగిపోయిన పేగు బంధాన్ని వెతుక్కుంటూ వచ్చిన రెండోతరం కాకతీయుల వారసుడు.. ఛత్తీస్గఢ్లోని బస్తర్ మహారాజు కమల్చంద్ర భంజ్దేవ్కు ఓరుగల్లు గడ్డ అడుగడుగునా ఘన స్వాగతం పలికింది. తెలంగాణ ప్రభుత్వం వారం పాటు కనులపండువలా నిర్వహించ తలపెట్టిన ‘కాకతీయ వైభవ సప్తాహం’ గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కాకతీయుల వారసుడిని చూసేందుకు వేలాది మంది ప్రజలు తరలిరాగా వందలాది మంది కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలతో చారిత్రక నగరం పులకించి పోయింది. ముఖ్యంగా వరంగల్ కోటలో రెండున్నర గంటల పాటు సాగిన రథయాత్ర ఆద్యంతం ఆకట్టుకున్నది.
కాకతీయ ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు వరంగల్కు వచ్చిన కమల్చంద్ర భంజ్దేవ్ను మొదట భద్రకాళీ ఆర్చ్ వద్ద రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ తదితరులు ఘనంగా స్వాగతించారు. అనంతరం కాకతీయుల ఇలవేల్పు భద్రకాళీ ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సుమారు గంట పాటు ఆలయంలోనే ఉన్న కమల్చంద్ర, గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ప్రతినిధి రాఘవ నేతృత్వంలో భద్రకాళీ ఆలయం వెనుక ఉన్న బండ్పై బిల్వ, కబంధ మొక్కలు నాటారు. ఆలయ ఆవరణలో పేరిణి నృత్య ప్రదర్శనను తిలకించారు.
పులకించిన ఓరుగల్లు కోట
వందల ఏళ్ల తర్వాత కాకతీయుల వారసుడి రాకతో ఓరుగల్లు కోట పులకించిపోయింది. బస్తర్ రాజు కమల్చంద్రకు వరంగల్ కోటలో మట్టికోట పశ్చిమ ద్వారం వద్ద మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీ, మేయర్తో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అపూర్వ స్వాగతం పలికారు. కాకతీయుల నాటి వైభవాన్ని తలపించేలా సుందరంగా అలంకరించిన రథంపై అశ్వదళం, కళాకారుల ఆటపాటలు, డప్పు, డోలు, తాళాలు, ఇతర వాయిద్యాల సందడితో సాదరంగా కోటలోకి తీసుకెళ్లి చేతికి ఖడ్గాన్ని అందించారు. మధ్యకోటలోని స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని స్వామివారికి రుద్రాభిషేకం చేశారు. పూజల అనంతరం ప్రత్యేక వేదికపై నుంచి బెలూన్లు ఎగురవేసి కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభమైనట్లు ప్రకటించారు. తిరుగు ప్రయాణంలో వేయిస్తంభాల గుడిని కమల్చంద్ర సందర్శించారు. రుద్రేశ్వరుడికి పూజలు చేసి ఆలయ ప్రాశస్త్యాన్ని తెలుసుకున్నారు. తమ ఘనచరిత్రను కాపాడుతున్నందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
కళాకారుల సందడి
కాకతీయ వైభవ సప్తాహం తొలిరోజు 700 మంది కళాకారులు, బోనాలతో తరలివచ్చిన మహిళలు, గిరిజన, కోయ, ఆదివాసీ కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రజలను మంత్రముగ్ధులను చేశారు. వేయిస్తంభాల ఆలయం, భద్రకాళీ ఆలయ ఆవరణ, కోట ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు.
‘నమస్తే’ ప్రత్యేక ఆకర్షణ
ఖిలావరంగల్ : కాకతీయ వైభవ సప్తాహం వేడుకల్లో ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికపై ప్రజలు, కవులు, కళాకారులు, చరిత్ర పరిశోధకులు అభినందనల వర్షం కురిపించారు. కాకతీయుల చరిత్ర ప్రతాపరుద్రుడితో అంతం కాలేదని, వారి ఆనవాళ్లు బస్తర్లో ఉన్నాయని నమస్తే తెలంగాణ దిన పత్రికలో 2014 సెప్టెంబర్ 15న ప్రచురితమైన ‘బస్తర్లో రెండో కాకతీయుల సామ్రాజ్యం’ అనే ప్రత్యేక కథనం సంచలనం సృష్టించింది. 2014 నవంబర్ 5న ‘ఓరుగల్లు టు జగదల్పూర్’, ‘చెరగని చరిత్రకు సజీవ సాక్ష్యాలు’, 2014 నవంబర్ 6న ‘ఇప్పటికీ మహారాజే’, నవంబర్ 7న ‘ఆలయంలో ఆనవాళ్లు’ ఇలా వరుస కథనాలతో మేధావులను, పరిశోధకులను కదిలించింది. ఈ కథనాలన్నింటిని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఫ్లెక్సీలో ప్రింట్ వేయించి మట్టికోట పశ్చిమ ద్వారం వద్ద ఏర్పాటు చేయగా వీక్షించిన స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
అడుగడుగునా పూల వర్షం
కాకతీయుల వారసుడు తొలిసారి కోటకు వస్తున్నాడని తెలిసి కోటలోని ప్రజలతోపాటు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా నిల్చొని పూల వర్షం కురిపించారు. సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగిన యాత్రలో అడుగడుగునా పూలుజల్లుతూ కమల్చంద్రను స్వాగతించారు.
బస్తర్లో ఉన్నట్లే ఉంది
మీ ప్రేమ ఆప్యాయతలు చూస్తే నాకు బస్తర్లో ఉన్నట్లే ఉంది. 700 ఏళ్ల క్రితం మా వంశస్తులు ఇక్కడి నుంచి బస్తర్వైపు వెళ్లారు. గెజిట్ నోటిఫికేషన్లో మా తాతపేరు మహారాజా ప్రవీర్ చంద్ర భంజ్దేవ్ కాకతీయ అని ఉంది. ఇంటిపేరు తర్వాత కాకతీయ అని ఉండడంపై కొన్ని పరిశోధనలు చేస్తే మా కుటుంబానికి ఓరుగల్లుతో సంబంధాలున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు కాకతీయ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. భద్రకాళీ, దంతేశ్వరీ మాత ఆశీస్సులు తెలంగాణ, బస్తర్ ప్రజలపై ఉంటాయి. ఈయేడు వర్షాలు సమృద్ధిగా కురిసి మన రైతులు పుష్కలంగా పంటలు పండించాలి.
-కమల్చంద్ర భంజ్దేవ్, కాకతీయుల వారసుడు
కాకతీయుల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పాలన
కాకతీయుల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణలో జనరంజక పాలన అందిస్తున్నారు. మిషన్ కాకతీయ పేరుతో కాకతీయుల గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించారు. ప్రాజెక్టులు నిర్మించి తాగు, సాగు నీటి ఇబ్బందులు తీర్చారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరించాలి.
-మంత్రి శ్రీనివాస్గౌడ్
వైభవంగా వేడుకలు
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకు కాకతీయుల వారసుడు, బస్తర్ మహారాజు కమల్చంద్ర భంజ్దేవ్ ఉత్సవాలకు రావడం ఆనందంగా ఉంది. కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
– చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్
తెలంగాణలోనే ఉత్సవాలు
తెలంగాణ ఏర్పాటు తర్వాతనే కాకతీయుల కళావైభవాన్ని గుర్తు చేస్తూ సీఎం కేసీఆర్ ఏటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ కోటను టూరిజం హబ్గా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు.
-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్