అక్కన్నపేట, జూలై 5: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పల్లెల్లో గుణాత్మక మార్పు వచ్చిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్కుమార్ అన్నారు. మంగళవారం అక్కన్నపేట మండలం అంతకపేటలో కరీంనగర్ డెయిరీ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ను హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాడి రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వినోద్కుమార్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత గ్రామీణ ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో మిషన్కాకతీయ ద్వారా 44వేల చెరువులకు మరమ్మతులు జరిగాయన్నారు. ఫుల్గా కరెంట్, పుష్కలంగా నీళ్లు, పుట్లకొద్దీ వడ్లు పండతున్నాయన్నారు. ఎండాకాలంలో సైతం గోదావరి జలాలతో చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయన్నారు.
ప్రాజెక్ట్ రీడిజైన్ చేసి, నేడు కోటి ఎకరాలకు సాగు నీరందిస్తున్నామన్నారు. రైతుల జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులను అడిగేటోళ్లు లేక పిచ్చికూతలు కూస్తున్నారన్నారు. తెలంగాణ అన్ని రంగా ల్లో ముందంజలో ఉందన్నారు. వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పాడి పరిశ్రమను పెంచుకొని, పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలన్నారు. పాల ఉత్పత్తిదారులకు రావాల్సిన లీటర్పై రూ.4 ఇన్సెంటీవ్ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, త్వరలో అందేలా చూస్తామన్నారు. పెండింగ్ సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. గ్రామానికో పశువుల హాస్టల్ కోసం ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ నగరానికి నిత్యం ఇతర రాష్ర్టాల నుంచి లక్షలాది లీటర్ల పాలు దిగుమతి అవుతున్నాయని, ఇక్కడి రైతులకు ప్రోత్సాహకం అందించి పాలు ఇక్కడే వందశాతం పంపిణీ జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. అందుకు సంబంధించి ఇక్కడి పాల డెయిరీలకు ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారం అందిస్తోందన్నారు. మార్కెట్లో ఈ డెయిరీ పాలకు మంచి డిమాండ్ ఉందన్నారు. డెయిరీకి రాజేశ్వర్రావు చేస్తున్న సేవలను కొనియాడారు.
పాల వినియోగం పెరిగింది
మనిషి జీవితంలో నీళ్లతో పాటు పాలు కూడా ప్రధాన అవసరంగా ఏర్పడిందని, నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు పాల వినియోగం పెరిగిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. రైతులు వ్యవసాయంతో పాటు పాల ఉత్పత్తి చేపట్టాలన్నారు. ఇందుకు కరీంనగర్ డెయిరీ ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకంగా ఆవులు, గేదెలు కొని ఇస్తోందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో తాజాగా చిగురుమామిడి, అక్కన్నపేట, ఎల్కతుర్తి మండలాల్లో బల్క్, మిల్క్ కూలింగ్ యూనిట్లను ప్రారంభించడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ యూనిట్ల సామర్థ్యాన్ని మరింత పెంచుకునేలా రైతులు ఎక్కువగా పాల ఉత్పత్తిని పెంచుకోవాలన్నారు.
డెయిరీని తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాం
ప్రస్తుతం డెయిరీ ద్వారా సుమారు 1.50 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతున్నదని, దీనిని త్వరలోనే 2 లక్షల లీటర్లకు చేరుకుంటామని కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు తెలిపారు. ఇప్పటికే స్థానికంగా పాల ఉత్పత్తుల్లో ముందంజలో ఉన్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కరీంనగర్ డెయిరీని విస్తరించాలనే ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు పాడి పరిశ్రమతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. డెయిరీ కింద ఇప్పటి వరకు 30 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ప్రారంభించామన్నారు. త్వరలో మరో 6 యూనిట్ల ప్రారంభిస్తామన్నారు. పాడి రైతులకు అన్ని విధాలా కరీంనగర్ డెయిరీ సేవలను అందిస్తోందన్నారు. రైతు కుటుంబాలకు అండగా నిలుస్తోందన్నారు. డెయిరీ ద్వారా అమలువుతున్న పలు పథకాలను వివరించారు. కార్యక్రమంలో కరీంనగర్ డెయిరీ ఎండీ శంకర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీపీ మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ మంగ, సర్పంచ్ ఇర్రి లావణ్య, ఎంపీటీసీ కంది రజిత, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.