సిద్దిపేట, జూలై 5 : ప్లాస్టిక్ రహిత పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి కోరారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో దుకాణాదారులు, హోటల్స్ యజమానులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని హోటళ్లు, కిరాణ దుకాణాలు, టిఫిన్ సెంటర్లలో ప్లాస్టిక్ కవర్లు నిషేధించాలన్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా టిఫిన్ బాక్స్లను ఉపయోగించాలన్నారు.
కొద్దిరోజులుగా పలు దు కాణాలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించామని, చాలావరకు ఇస్తరాకులు, ఆరటి ఆకులు, టిఫిన్ బాక్స్లు వాడుతున్నారని తెలిపారు. ముస్తాబాద్ చౌరస్తాలో గల టిఫిన్ సెంటర్లో మోతుకు ఆకులు వాడటంపై అవగాహన కల్పించేలా బ్యానర్లు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలో 43 వేల ఇండ్లలో అందరూ తడి, పొడి, హా నికరమైన చెత్తను వేరు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు టిఫిన్ సెంటర్లకు వెళ్లేటప్పుడు బాక్స్లు తీసుకెళ్లాలని చెప్పారు. అనంతరం బయో ప్లాస్టిక్ కవర్లలో వేడి సాంబారు పోస్తే కలిగే అనర్థాలు, కవర్లలో వేడి నీరు పోసి ఆరోగ్యానికి హాని ఎలా కలుగుతుందో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ మల్లికార్జున్, మేనేజర్ శ్రీనివాస్రెడ్డి, హరితహారం అధికారి ఐలయ్య, హోటల్స్ యజమానులు పాల్గొన్నారు.